న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రధానఘట్టంగా ఉండే దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బోనస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘2019 – 2020 సంవత్సరానికి సంబంధించి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్, నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల 30 లక్షలకు పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగులు బోనస్ ద్వారా లబ్ధి పొందుతారు. బోనస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.3737 కోట్లు ఆర్థిక భారం పడుతుంది.’ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. అలాగే ఈ బోనస్ను సింగల్ ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో చెల్లిస్తారు. దసరాకి ముందే బోనస్ వస్తుందని ప్రకాష్ జావదేకర్ కేబినెట్ మీటింగ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన బోనస్ రైల్వే, పోస్టల్, డిఫెన్స్, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి వాటిలో సుమారు రూ.16.7 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్కు అందుతుంది. నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూ.13.70 లక్షల మంది నాన్ గెజిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందుకుంటారు.