Friday, April 26, 2024

‘ఇస్మార్ట్’ మస్క్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: మనిషి మెదడును కంప్యూటర్‌కు అనుసంధానం చేసి దాన్ని మరింత చురుగ్గా పని చేసే చిప్‌ను రూపొందించే దిశగా మరో ముందడుగు పడింది. తొలి సారిగా మానవుల్లో ప్రయోగశాల అధ్యయనాలు (క్లినికల్ స్టడీ) నిర్వహించడానికి తమ సంస్థకు అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డిఏ అనుమతి లభించినట్లు ఈ దిశగా పరిశోధనలు జరుపుతున్న ఎలాన్ మస్క్‌కు చెందిన ‘న్యూరాలింక్’ సంస్థ తెలియజేసింది. చిప్‌ద్వారా మనిషి మెదడు కార్యకలాపాలను డీకోడ్ చేయడంతో పాటుగా దాని యాక్టివిటీని మరింత ఉద్దీపింప జేసే టెక్నాలజీని అభివృద్ధి చేయాలనేది న్యూరాలింక్ సంస్థ లక్షం. 2006లో కొంతమంది ఇంజనీర్లు, సైంటిస్టులతో కలిసి ఎలాన్ మస్క్ ఈ న్యూరాలింక్‌ను ఏర్పాటు చేశారు.

అప్పటినుంచి ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. నేటి అపరిష్కృతంగా ఉన్న వైద్య అవసరాలను తీర్చడంతో పాటు రేపటి మానవ సామర్థాన్ని బైటికి తీసే ఒక జనరలైజ్డ్ మెదడు ఇంటర్‌ఫేస్ (చిప్)ను రూపొందించడం తమ లక్షమని న్యూరాలింక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మానవ మెదళ్లు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం కంప్యూటర్లతో సంభాషించేలా చేయడమే న్యూరాలింక్ ఇంప్లాంట్‌ల లక్షమని 2022లో జరిగిన ఓ ప్రజంటేషన్‌లో ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.తన పిల్లల్లో ఈ ఇంప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని కూడా అప్పుడు మస్క్ చెప్పారు. తమ తొలి మానవ ఇంప్లాంట్ కోసం తామంతా ఎంతో కష్టపడుతున్నామని ఆయన ఆ సందర్భంగా అంటూ అయితే ఒక పరికరాన్ని మనిషిలో ప్రవేశపెట్టడానికి ముందు అది బాగా పని చేస్తుందని తాము నిర్ధారించుకోవాలని అనుకుంటున్నామని కూడా చెప్పారు.

అయితే జంతువుల్లో ఈ సంస్థ జరిపిన ప్రయోగాలపై అనేక ఆరోపణలు వచ్చాయి కూడా. కాగా న్యూరాలింక్ టీమ్ ఎఫ్‌డిఎతో కలసి చేసిన కృషి ఫలితం ఈ అనుమతి అని ఏదో ఒక రోజు మా టెక్నాలజీ చాలా మందికి తోడ్పడేలా చేసే దిశగా ఓ ముఖ్యమైన తొలి అడుగు అని కంపెనీ శుక్రవారం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఈ ప్రయోగశాల ప్రయోగాల కోసం రిక్రూట్‌మెంట్ ఇంకా మొదలు కాలేదని, త్వరలోనే దీనిపై మరింత సమాచారాన్ని ప్రకటిస్తామని కంపెనీ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News