న్యూఢిల్లీ : దేశంలోని సైనిక్ స్కూళ్లలోని 10 శాతం సీట్లను బాలికలకు కేటాయించారు. ప్రతిష్టాత్మక సైనిక స్కూళ్లలో ప్రవేశాల విధానం సంస్కరణల్లో భాగంగా ఈ మార్పులకు దిగారు. వీటిలో బాలికలకు పదిశాతం సీట్లను కేటాయిస్తున్నట్లు, ఒబిసిలకు కోటాను అమలు చేయనున్నట్లు అధికారవర్గాలు శనివారం తెలిపాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ)లో స్థానం సంపాదించుకోవడానికి సైనిక్ స్కూళ్లలో విద్యాభ్యాసం ప్రాతిపదిక అవుతుంది. వీటిలో ప్రవేశాల విషయంలో రక్షణ మంత్రిత్వశాఖ పలు కీలక మార్పులు చేపట్టింది. సైనిక స్కూళ్లలో కేటగిరికి ఒక సీటును బాలికలకు రిజర్వ్ చేస్తున్నట్లు , మొత్తం మీద పదిశాతం సీట్లు వారికి కల్పిస్తున్నట్లు మంత్రిత్వశాఖ ఓ సర్కులర్ను వెలువరించింది. గత ఏడాది అక్టోబర్లో రక్షణ మంత్రి సైనిక స్కూళ్లల్లో బాలికల కోటా గురించి విధాన నిర్ణయానికి ఆమోదం తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సైనిక్ స్కూళ్లలో ఎస్సిలకు 15 శాతం , ఎస్టిలకు 7 శాతం, ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మిగిలిన సీట్లలో డిఫెన్స్ కేటగిరి కింద పాతిక శాతం కోటా అమలు అవుతుంది. ఇక మిగిలినవి జనరల్ కేటగిరి పరిధిలోకి వస్తాయి.