Thursday, March 28, 2024

 అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్

- Advertisement -
- Advertisement -

551 Oxygen Production Plants In India

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 10 వేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ పడకల సంఖ్య 20 వేలకు చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో రాష్ట్రంలో 18,232 కొవిడ్ పడకలు ఉన్నాయని, దానిని 49,133 పడకలకు పెంచినట్లు వెల్లడించారు. ఈ సంఖ్యను 60 వేల పడకలకు పెంచడానికి తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డితో కలిసి సీనియర్ అధికారులతో బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో శనివారం సమావేశం నిర్వహించి, రాష్ట్రంలోని కొవిడ్ పరిస్థితిని తెలుసుకున్నారు. కొవిడ్ మహామ్మారిని అధిగమించుటకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సిఎస్ తెలిపారు. కొవిడ్ పాజిటివ్ రోగులకు అవసరమైన సేవలను అందించుటకు అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే జిహెచ్‌ఎంసిలో కొవిడ్ రోగుల సహాయార్ధం కాల్ సెంటర్ (040-21111111) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు, కొవిడ్ రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 7.5 లక్షల కొవిడ్ మెడికల్ కిట్‌లతోపాటు అదనంగా మరో 5 లక్షల మెడికల్ కిట్‌లను ఉచితంగా పంపిణీ చేసెందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్ పాజిటివ్ రోగులకు మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
పడకల సంఖ్య పెంచేందుకు చర్యలు
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిఎస్ తెలిపారు. ఈ పనులు వారంలో పూర్తి అవుతాయని అన్నారు. నిమ్స్‌లో(500), సరోజిని దేవిలో (200), ఛాతీ ఆసుపత్రిలో (50), గాంధీలో (200), టిమ్స్‌లో (200) అదనపు పడకలను పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా గోల్కొండలో (100), మలక్‌పేటలో(100), వనస్థాలిపురంలో (100), అమీర్‌పేటలో (50) కొవిడ్ పడకలు అదనంగాఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన ఔషధాలు ,అవసరమైన మెడికల్ పరికరాలు కొరతను నివారించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం, పనిచేస్తోందని చెప్పారు. సిఎం ఆదేశాల ప్రకారం, రోగులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సిలలో అన్ని ఖాళీలను వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వేగంగా భర్తీ చేసేందుకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావుకు అప్పగించిట్లు పేర్కొన్నారు. రెమిడిసివర్ వంటి ఔషధాల డిమాండ్ దృష్ట్యా, సిఎం కోరిన విధంగా రాష్ట్రానికి తగిన మొత్తాలను సేకరించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు సీనియర్ ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని అన్నారు. జిహెచ్‌ఎంసి మినహ జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారని, సీనియర్ జిల్లా అధికారులు ఇతర ఆసుపత్రులకు ప్రత్యేక అధికారులుగా ఉంటాదని తెలిపారు.
మరిన్ని వ్యాక్సిన్లు కేటాయించాలని కేంద్రానికి లేఖ
ప్రభుత్వం 18- నుంచి 44 సంవత్సరాల వయస్సులో 1.72 కోట్ల మంది జనాభా ఉంటే, 2021మే నెలలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేవలం 4.4 లక్షల డోసులను మాత్రమే కేటాయించింది. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సి న్లు కేటాయించాలని కేంద్రానికి తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రెండవ డోస్ వేయుటకు 30.45 లక్షల డోస్‌లు అవసరం కాగా, మే తొలి పక్షం రోజులకు 8.35 లక్షల డోస్‌లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చి, కేటాయింపులు పెంచాలని సిఎస్ లేఖలో కోరారు.
600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలి
ఒడిశాకు ట్యాంకర్లను పంపడానికి స్థిరమైన పర్యవేక్షణ, ఐఎఎఫ్ విమానం, రైల్వే రేక్ల వాడకం కారణంగా, ఆక్సిజన్ సరఫరా సంతృప్తికరమైన స్థాయిలో నిర్వహించబడుతుందని సిఎస్ తెలిపారు. అయితే పెరిగిన ఆక్యుపెన్సీతో, ఆక్సిజన్ అవసరం పెరుగుతుందని, సామాగ్రిని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రోజుకు 430 మెట్రిక్ టన్నుల కేటాయించారని, అవసరాల దృష్ట్యా రోజుకు రాష్ట్రానికి 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించాలని సిఎస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జి.హెచ్. యం.సి కమిషనర్ లోకేశ్ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్ రోస్, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ , మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News