బెంగళూరు: ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్ఎస్ దొరస్వామి తన 103వ ఏట కొవిడ్-19పై పోరులో విజయం సాధించి ఆసుపత్రి నుంచి తన ఇంటికి సంపూర్ణ ఆరోగ్యంతో పయనమవుతున్నారు. ఐదు రోజుల క్రితం తనకు కొవిడ్ లక్షణాలు కొన్ని ఏర్పడ్డాయని, అయితే తీవ్ర అస్వస్థత ఏదీ ఏర్పడలేదని బుధవారం ఆయన తెలిపారు. అయినప్పటికీ తనకు శ్వాసకోశ సమస్యలు ఉన్న కారణంగా ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళుతున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వ యాజమాన్యంలోని శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. జయదేవ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్టు, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ్ అల్లుడు అయిన డాక్టర్ సిఎన్ మంజునాథ్ శతవసంతాలు దాటిన దొరస్వామి చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. 1918 ఏప్రిల్ 10న జన్మించిన దొరస్వామి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1943 నుంచి 1944 మధ్య 14 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించారు.