కొత్తగా 122 కరోనా కేసులు…ఒకరి మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. క్రియాశీల కేసులు 4 వేల దిగువకు రావడం, రికవరీ రేటు పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. రాష్ట్రంలో 3,924 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,676 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 122 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,68,955కు పెరిగింది. తాజాగా 176 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,61,093 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,938కు చేరింది. జిల్లాల వారీగా జిహెచ్ఎంసి పరిధిలో 55 నమోదు కాగా, అదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం అసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగతా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.