Thursday, April 25, 2024

భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం

- Advertisement -
- Advertisement -

19 laborers disappeared on India-China border

న్యూఢిల్లీ : భారత్‌చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. అయితే వీరిలో ఒకరి మృతదేహం సమీపం లోని నదిలో లభ్యమైనట్టు కథనాలు వస్తున్నాయి. మిగిలిన వారు కూడా నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనధికారిక సమాచారం. దీంతో అదృశ్యమైన కూలీల కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల కురుంగ్ కుమే జిల్లాలోని దమిన్ సర్కిల్ లో సరిహద్దు రహదారుల సంస్థ ( బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్‌ఓ ) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ పనిచేసేందుకు ఓ కాంట్రాక్టర్ 19 మంది కూలీలను అస్సాం నుంచి తీసుకొచ్చారు.

అయితే బక్రీద్ పండగ నిమిత్తం వీరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెలవు అడగ్గా కాంట్రాక్టర్ అంగీకరించలేదు. దీంతో ఈనెల 5న ఈ కూలీలంతా తమ శిబిరాల నుంచి పారిపోయారు. నాటి నుంచి వీరు కన్పించకుండా పోయినట్టు తెలుస్తోంది. దీనిపై జులై 13న స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. వీరి కోసం పోలీసులు గాలిస్తుండగా, దమిన్ ప్రాంతం లోని కుమే నదిలో ఇటీవల ఓ మృతదేహం లభ్యమైంది. అది అదృశ్యమైన కూలీల్లో ఒకరిదంటూ సోషల్ మీడియా , స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పారిపోతున్న క్రమంలో కూలీలంతా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కూలీలంతా అస్సాం లోని కొక్రాఝర్, దుబ్రీ ప్రాంత వాసులుగా గుర్తించారు. ఈ ఏడాది మే లోనే వీరిని అరుణాచల్ ప్రదేశ్‌కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కూలీల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టామని కుమే జిల్లా డిప్యూటీ కమిషనర్ నీఘే బెంగియా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News