మనతెలంగాణ/జవహర్నగర్: ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన శనివారం మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒకరిని కాపాడబోయి చిన్నారులిద్దరూ మృతిచెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని అరుందతినగర్కి చెందిన రామకృష్ణ, నాగేంద్రల కుమారుడు హేమంత్(11) బాలాజీనగర్లోని ఫైరింగ్కట్ట ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన సర్జివజాదవ్, సుఖంతి జాదవ్ల కుమారుడు రాహుల్ జాదవ్(9) శామీర్పేటలోని తుర్కపల్లిలో గల హాస్టల్లో ఉంటూ 4వ తరగతి చదువుతున్నాడు. వీరు అరుందతి నగర్లో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటివల పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో కొంత మంది పిల్లలు అరుందతినగర్ కాలనీకి సమీపంలో సర్వే నెంబర్ 706లో గల క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లుతున్నారు. శనివారం రాహుల్ జాదవ్ అక్కలు క్వారీ గుంతలో బట్టలు ఉతుకడానికి వెళ్లుతుండగా చిన్నారులిద్దరూ ముందే క్వారీ గుంతకు వెళ్లి ఈత కొడుతున్నారు.
రాహుల్ జాదవ్ అక్క ఫతుల్(10)క్వారీ గుంతలో ఈత కొడుతూ మునిగిపోతుండగా పక్కనే బట్టలు ఉతుకుతున్న స్వప్న అనే యువతితో పాటు చిన్నారులిద్దరూ నీటిలోకి దిగి ఆ అమ్మాయిని గట్టుపైకి తీసుకరావడానికి ప్రయత్నించారు. ఇందులో ఫతుల్ గట్టుబయటకు రాగా స్వప్న నీటీలోనే కొట్టుమిట్టాడుతుండగా గట్టు మీద ఆమె కుమారుడి సహాయంతో బయటకు రాగలిగింది. అయితే చిన్నారులు ఇద్దరూ హేమంత్, రాహుల్ జాదవ్లు నీటిలో మునిగిపోయారు.ఈ విషయాన్ని ఆ యువతి స్థానికులకు సమాచారం ఇచ్చి వారి సహాయంతో నీటిలో నుండి చిన్నారులిద్దరిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెంది ఉన్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ సంఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
2 boys died while swimming in pond in Medchal