మనతెలంగాణ/హైదరాబాద్: ములుగు ఎన్కౌంటర్ను రాష్ట్ర పౌరహక్కుల సంఘం సోమవారం ఒక ప్రకటనలో ఖండించింది. మావోయిస్ట్ సుధీర్, లాక్మాల్ను పట్టుకుని కాల్చిచంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఎన్కౌంటర్లపై నిజనిర్ధారణ చేయడానికి ప్రజాస్వామిక వాతావరణం కల్పించాలని, అన్ని ఎన్కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ ప్రదేశానికి మీడియా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని, రాత్రికి రాత్రే మృతదేహాలను తరలించారని తెలిపారు.
నిజనిర్ధారణ చేస్తే ప్రభుత్వ స్వభావం భయటపడుందని, అందువల్లే నిజనిర్ధారణ కమిటీలను అడ్డుకుంటున్నారని పౌరహక్కుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన చర్ల ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు వెళ్లిన మానవహక్కుల వేదిక బృందాన్ని నిర్బంధించారని, వారిని బైండోవర్ చేసి విడిచి పెట్టారని గుర్తుచేశారు. ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసు కూంబింగ్ను వెంటనే ఆపాలని, ఎన్కౌంటర్ హత్యలను కట్టడి చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్కౌంటర్లను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని లక్ష్మణ్, నారాయణరావు ఆ ప్రకటనలో కోరారు.
2 Maoists killed in Mulugu Encounter