దేశీయంగా రెండు వ్యాక్సిన్లు.. మొదటిదశ ఫలితాలు సురక్షితం
భారత్ బయోటెక్, క్యాడిలా వ్యాక్సిన్లను ప్రస్తావించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ఐసిఎంఆర్తో కలిసి దేశీయ ఔషధ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో ఎంతో సురక్షితమని తేలిందని ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీచౌబే తెలిపారు. భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్కేర్ రూపొందించిన వ్యాక్సిన్ల గురించి ఆయన ప్రస్తావించారు. కొవిడ్19 నియంత్రణ కోసం వ్యాక్సిన్లు రూపొందించడంలో ఐసిఎంఆర్సహా దేశీయ ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ పరిస్థితిపై రాజ్యసభలో మంగళవారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్పైనా చర్చలు జరుగుతున్నాయని, అయితే దానిపై ఇంకా అధ్యయనం ప్రారంభించలేదని మంత్రి తెలిపారు.
మరో రెండు అంతర్జాతీయ సంస్థల వ్యాక్సిన్ల తయారీలోనూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), ఐసిఎంఆర్ కలిసి పని చేస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ ట్రయల్స్లో ఎస్ఐఐ భాగస్వామిగా ఉన్నది. ఈ వ్యాక్సిన్ మూడోదశ ట్రయల్స్ బ్రెజిల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్లో ఎస్ఐఐతోపాటు ఐసిఎంఆర్ భాగస్వామిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ను దేశీయంగా ఎస్ఐఐ తయారు చేస్తుందని, అక్టోబర్లో మొదటిదశ ట్రయల్స్ ప్రారంభం కానున్నట్టు అశ్వినీచౌబే తెలిపారు. ఈ ట్రయల్స్కు ఐసిఎంఆర్తోపాటు పూణెలోని నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నేతృత్వం వహిస్తాయని తెలిపారు. పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, అయితే ఎప్పుడు వస్తుందనే విషయంలో కచ్చితమైన సమయం చెప్పలేమని చౌబే అన్నారు.
2 Vaccines Phase 1 trials Excellent Safety: Ashwini Choubey