మహమ్మారిని జయించిన 20 రోజుల శిశువు
మహబూబ్నగర్ చిన్నారికి మాతృ ప్రేమను అందించిన గాంధీ వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : కరోనా మహమ్మారి వయస్సు సంబంధలేకుండా పెద్దలు, చిన్నారులను కబళిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతుంది. రెండు నెలల్లో తెలంగాణలో 1016పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 25మంది వరకు చిన్నారులు ఉన్నారు. వీరందరికి గాంధీ ఆసుపత్రిలో వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. బుధవారం గాంధీ వైద్యులు 20 రోజుల వయస్సు గల ఓ చిన్నారికి ప్రాణం పోసి మాతృప్రేమ అందించారు. 19 రోజుల క్రితం ఓ తల్లి కరోనా పాజిటివ్ వచ్చిన తన బిడ్డతో ఎంతో ఆందోళనగా ఆసుపత్రిలో అడుగుపెట్టింది. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు చిన్నారికి నాణ్యమైన సేవలు అందించారు. దీంతో చిన్నారి కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడింది. పాప క్షేమంగా ఉండటంతో తల్లి ఒడికి చేర్చి ఇంటికి పంపారు. ఈనెల 10న మహబూబ్నగర్ జిల్లా మర్లు గ్రామానికి చిన్నారికి విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు పాపకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో ఆ చిన్నారిని గాంధీకి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో చిన్నారి కోలుకుంది. ఈ చిన్నారితో పాటు రెండేళ్ల వయస్సు కలిగిన 13మంది పిల్లలు కరోనా జయించారని గాంధీ వైద్యులు తెలిపారు.