హైదరాబాద్: తెలంగాణలో 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నుంచి ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. తెలంగాణలో 20 వేల మంది క్యారంటైన్లో ఉన్నారని, శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. లాక్డౌన్ ప్రకటించకపోతే ఇంకా కేసుల సంఖ్య పెరిగి ఉండేదన్నారు. కరోనా చాలా భయంకరమైన వ్యాధి అని తెలియజేశారు. ప్రజలందిస్తున్న సహకారానికి ధన్యవాదాలన్నారు. ఎవరికి వాళ్లు నియంత్రణ పాటించడం వల్లే నిలువరించగలుగుతున్నామని, సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట వేస్తామని, ఇప్పటికైనా పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధికి మందు లేదన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో 11 వేల వెంటిలేటర్లు ఉన్నాయని, న్యూయార్క్ సిటీలోనే మూడు వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, ఐనా కూడా ఆ నగరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
వైద్యానికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని, 60 వేల మందికి కూడా చికిత్స అందించేలా సన్నద్ధమవుతున్నామని, రిటైర్ అయిన డాక్టర్లు, ల్యాబ్ టెక్సీషియన్లు, ఎంబిబిఎస్ పాసైన వారితో లిస్ట్ తయారు చేస్తున్నామని, ఎనిమిది వేల వైద్యులు ఇప్పటికే పని చేస్తున్నారని, 14 వేల మంది సిబ్బందిని అదనంగా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా తమ బిడ్డలేనని, ఎవరూ ఆకలితో ఉండరని, అందరి కడుపులు నింపుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు. చైనా, ఇటలీ స్థాయిలో వైరస్ ప్రబలితే 20 కోట్ల మంది మీద ప్రభావం చూపిస్తుందని, స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అని తెలియజేశారు.
మనకు ఏమవతుందిలేని అని నిర్లక్ష్యం పనికి రాదని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉందన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడానని, ఎలాంటి సహకారం అందించాలన్నా సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారన్నారు. మనం ఇంకొకరిపై ఆధారపడకుండా మనకు ఉన్న వనరులతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఒక్కొక్క దశలో నాలుగ వేల మందికి ఐసోలేషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో 11 వేల మందిని పెట్టుకునే కెపాసిటి ఉందన్నారు. 1400 ఐసియు బెడ్స్ కూడా సిద్ధం చేశామన్నారు.