Wednesday, April 24, 2024

కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే

- Advertisement -
- Advertisement -

Corona cases

 

50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు…
కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం
1082కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య
జిహెచ్‌ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు
వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల ప్రకటన
కేసులు అధికంగా ఉన్న జిల్లాలకు కేంద్ర వైద్య బృందం పర్యటన

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ సోకిన వారిలో సుమారు 50 శాతం పేషెంట్‌లు పూర్తిస్థాయిలో కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహామ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం కరోనా బాధితుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1082 మందికి వైరస్ బారిన పడ్డారు. వీరిలోఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 545 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 508గా ఉంది. అదే విధంగా వైరస్ బారిన పడి 29 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

అయితే ఆదివారం కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలో నమోదు కావడం గమనార్హం. దీంతో పాటు కొత్తగా జగిత్యాల జిల్లాల్లో ఒకరికి వైరస్ సోకింది. అయితే ఆదివారం వైరస్ నుంచి కోలుకోని 46 మంది డిశ్చార్జ్ కాగా, దీనిలో 68 ఏళ్ల వృద్ధుడు సైతం ఉన్నారు. ఇతనికి డయాబెటిక్, న్యూమోనియా సమస్యలు ఉన్నప్పటికీ సుమారు 14 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

వనస్థలిపురంలో అందోళన……
హైదరాబాద్ వనస్థలిపురంలో అందోళన నెలకొంది. ఇక్కడ రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కాలనీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు కుటుంబాల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు అధికంగా వస్తున్నాయి. దీంతో వనస్థలిపురంలోని హుడాసాయినగర్, ఎబిటైప్ కాలనీ, ఎస్‌కెడి నగర్, కమలానగర్, సచివాలయనగర్లలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

హోల్‌సేల్ దుకాణాలపై నిఘా పెంచనున్న అధికారులు…..
గత వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ మార్కెట్ల నుంచి వస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమైనారు. ముఖ్యంగా హోల్‌సేల్ దుకాణాలపై అధికారులు నిఘా పెంచనున్నారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల ద్వారా ఇప్పటికే పలు రిటైల్ డీలర్లకు వైరస్ సోకింది. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

14 రోజులుగా 17 జిల్లాల్లో కేసులు లేవు…….
గత 14 రోజులుగా 17 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్ జిల్లాల్లో కేసులు లేవు.

వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిది: మంత్రి ఈటల
కోవిడ్ రోగులకు వైద్య సిబ్బంది అందించే సేవలు వెలకట్టలేనివని, ప్రాణాలకు తెగించి మరి పోరాడుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా ఆదివారం డాక్టర్స్‌ను, నర్సులను, ఇతర సిబ్బందిని స్థానికులు అభినందించడం సంతోషంగా ఉందన్నారు. పాక్షిక సడలింపుల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో కేంద్ర వైద్య బృందం పర్యటన… కోవిడ్ కేసులు అధికంగా ఉన్న జిల్లాల్లో కేంద్ర వైద్య బృందం పర్యటించనుంది. ఈమేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో పర్యటించేందుకు ప్రత్యేక అధికారులు ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. కేంద్ర కుటుంబ సంక్షేమ వైద్యులు డా జయంత్ దాస్, డా ధీపయాన్ బెనర్జీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నారు.

 

21 new Corona cases registered
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News