తప్పుడు అడ్రస్లు ఇస్తున్న అసింప్టమాటిక్ పేషెంట్లు, జిహెచ్ఎంసి పరిధి రోగుల వివరాల్లో గందరగోళం, ఫోన్ నంబర్లూ పలకడం లేదంటున్న అధికారులు, ట్రేసింగ్ చేస్తున్న ప్రత్యేక టీం
హైదరాబాద్ : అసింప్టమాటిక్తో కోవిడ్ సోకిన వారు తప్పుడు అడ్రస్లు ఇస్తున్నారు. గత రెండు వారాల నుంచి జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 2200 మంది వివరాల్లో గందరగోళం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాజిటివ్ సోకిన తర్వాత తమకు తప్పుడు అడ్రస్లు, పనిచేయాని ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వారు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోర్టల్లో నమోదు చేసిన ఫోన్లు సైతం పలకడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నా రు. దీంతో ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. అయితే వీరిని గుర్తించేందుకు వైద్యశాఖ, జీహెచ్ఎంసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ట్రేస్ చేసే పనిలో నిమగ్నమైందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
పర్యవేక్షణకు ఇబ్బంది….
లక్షణాలు లేకుండా, తక్కువ తీవ్రత కలిగి పాజిటివ్ సోకిన వ్యక్తులను ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం అధికారులు హోం ఐసోలేషన్లో ఉంచుతున్నారు. అయితే కొందరు అతి తెలివి ఉపయోగించి అధికారులు నమోదు చేసే రికార్డులలో, పోర్టల్లో తప్పుడు వివరాలను ఇస్తూ కన్ఫూజన్ చేస్తున్నారు. దీంతో సాధారణ పర్యవేక్షణకు వెళ్లిన బృందానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొంత మంది రోగులు ఇచ్చిన అడ్రస్కు పర్యవేక్షణ టీం వెళ్తే అక్కడ పాజిటివ్ వ్యక్తి ఉండటం లేదు. ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు. మరి కొందరు ఫోన్ నంబర్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రెండు రోజుల్లో వీరిని ట్రేసింగ్ చేస్తామని వైద్యశాఖ ధీమా వ్యక్తం చేస్తుంది.
వైరస్ వ్యాప్తికి అవకాశం…
మిస్ అవుతున్న పేషెంట్లతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం బాధ్యతగా కరోనా కట్టడి కోసం శ్రమిస్తుంటే, ఇలా తప్పుడు అడ్రస్లు ఇవ్వడం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొంత మంది కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇంకా లభించలేదని, వారిని కూడా రెండు రోజుల్లో గుర్తిస్తామని అధికారులు తెలిపారు. కరోనా సోకితే ఎలాంటి భయందోళనకు గురికావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాజంలో వెలివేత, చిన్నచూపు చూడటం వలనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఓ ముఖ్య అధికారి చెప్పారు.
పోలీసుల నజర్
నగరంలో మిస్సింగ్ అయిన 2200 మంది కరోనా పేషెంట్లు ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈక్రమంలో కరోనా వైరస్ సోకడంతో వారు వైద్య పరీక్షల అనంతరం కనిపించకుండా పోవడంపై జిహెచ్ఎంసి అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాగా మిస్సింగ్ అయిన పేషెంట్లలో దాదాపు 2000 వేల మంది తప్పుడు ఫోన్ నంబర్లు, అడ్రస్ ఇచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలావుండగా కోవిడ్-19 పేషెంట్లకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జిహెచ్ఎంసి అధికారులు ఆరా తీయగా దాదాపు 2,200 మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. దీంతో జిహెచ్ఎంసి అధికారులు పోలీసులకు విషయం తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే మిస్సింగ్ అయిన కరోనావైరస్ సోకిన వారు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడంతో పాటు ఆధార్ కార్డులో ఉన్న శాశ్వత చిరునామాలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.