నర్సింహారెడ్డి ధాతృత్వం దేశానికే ఆదర్శమని ప్రశంసలు
ఇది సిఎం కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి పట్టం.. మంత్రి ఎర్రబెల్లి
దమ్మన్నపేట గ్రామ అభివృద్ధికి రూ.25 కోట్ల విరాళం ప్రకటించిన నర్సింహా రెడ్డి
మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్ఎ రమేష్ సమక్షంలో రూ. 1.50 కోట్ల చెక్కు కెటిఆర్కు అందజేత
హైదరాబాద్: పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి. ఆ మధ్య వచ్చిన శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. ఆ కాన్స్ప్ట్కు స్పూర్తి ప్రధాతగా
కామిడి నర్సింహారెడ్డి నిలిచారు. ఆయన తన సొంత ఆలోచోనలతో సంపాదించడమే కాదు…. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు.
అందులో భాగంగా రూ.1.5 కోట్ల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎంఎల్ఎ ఆరూరి రమేశ్ల సమక్షంలో సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నర్సింహారెడ్డి ధాతృత్వాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఉన్న ఊరును, కన్న తల్లిని మరవని వాళ్ళే నిజమైన మనిషి అని ప్రశంసించారు.
పుట్టిన ఊరును మరిచిపోని నర్సింహారెడ్డి
పూర్వ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని దమ్మన్నపేటలో పుట్టి పెరిగిన కామిడి నర్సింహారెడ్డి వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడి బాగా సందపాదించారు. అయితే చాలా మందిలా తాను పుట్టిన ఊరిని మరిచిపోలేదు. పుట్టిన ఊరుకు ఏదో చేయాలన్న ఆలోచన ఆయనని తలుస్తూ ఉండేది. కానీ సందర్భం దొరకలేదు. ఏదో విధంగా సాయమైతే చేయాలనుకున్నారు. అనుకోకుండా పల్లెలను స్వయం సమృద్ధం చేయాలని, పచ్చదనం… పరిశుభ్రతలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన సిఎం కెసిఆర్, పల్లె ప్రగతి కార్యక్రానికి శ్రీకారం చుట్టారు. ఇదే సరైన సమయంగా భావించిన కామిడి నర్సింహారెడ్డి తన ఊరైన దమ్మన్నపేట గ్రామానికి రూ. 25 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఈ వార్త సంచలనంగా మారింది. అంతా నర్సింహారెడ్డిని అభినందించారు.
అసెంబ్లీలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేకంగా కామిడి ఔదార్యాన్ని ప్రకటించి కొనియాడారు. అంతకుముందు సిఎం కెసిఆర్ సైతం ఆయన దాన గుణాన్ని మెచ్చుకున్నారు. కాగా తాను ప్రకటించిన విరాళంలో భాగంగా రూ. 1.50 కోట్ల చెక్కును సోమవారం ఎర్రబెల్లి, ఆరూరి రమేశ్ల సమక్షంలో కెటిఆర్ నివాసంలో ఆయనను కలిసి చెక్ను అందజేశారు. ఈ విరాళాన్ని వర్ధన్నపేట మండల కేంద్రంలోని వైద్యశాల అభివృద్ధికి వినియోగించాలని మంత్రులు, ఎంఎల్ఎలను నర్సింహారెడ్డి కోరారు.