Thursday, April 25, 2024

27వేల ఆక్సిజన్ బెడ్లు

- Advertisement -
- Advertisement -

27 thousand Oxygen beds for Corona 3rd wave

కరోనా విజృంభించినా కట్టడి చేసే యత్నాలు, రాష్ట్రంలోనే 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు
27 వేల పడకలు ఆక్సిజన్ బెడ్లుగా మార్పు, పిల్లల కోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ పడకలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మూడో ముప్పును అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. కరోనా నేర్పిన పాఠాలతో ప్రభుత్వం ఆరోగ్యం రంగంపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుని చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్లతో ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాలు పెంపొందిస్తామని అసెంబ్లీ సిఎం కెసిఆర్ ప్రకటించారు. సెకండ్ వేవ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సొంతగా రాష్ట్రంలోనే 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు రాష్ట్రంలోని 27 వేల పడకలను పూర్తిగా ఆక్సిజన్ బెడ్లుగా మార్చింది. అలాగే పిల్లల కోసం పిడియాట్రిక్ బెడ్లు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. అలాగే కొవిడ్ టెస్టులను గణనీయంగా పెంచింది. దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో ఇప్పటికీ కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణలో కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చింది.

రాష్ట్రంలో 1,800 మాత్రమే కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.78 శాతం నమోదవుతోంది. అయితే కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దని, ప్రతి జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడూ ప్రజలను అప్రమత్తం చేస్తూనే వస్తోంది. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ యుద్ధప్రాతిపదికన కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ ప్రాంతాలలో నాలుగు దిక్కులా టిమ్స్ తరహాలో అన్ని వసతులతో ఆసుపత్రులు నిర్మించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే గడ్డి అన్నారం మార్కెట్‌ను తరలించి అక్కడ ఆసుపత్రి నిర్మించేందుకు చర్యలు ప్రారంభించగా, ఇతర ప్రాంతాలలో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.పేదలకు వైద్య సౌకర్యాలు పెంచే ఉద్ధేశంతో జిహెచ్‌ఎంసి పరిధిలో ఇప్పటికే 224 బస్తీ దావఖానాలు ప్రారంభం కాగా, త్వరలో వాటికి 350కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్ధేశంతో త్వరలోనే పల్లె దావఖానాలకు శ్రీకారం చుట్టనున్నారు.

కరోనా కష్టాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి విడతలో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్నవారికి వ్యాక్సినేషన్ ఇచ్చి, ఆ తర్వాత 18 ఏళ్లు పై బడిన వారికి టీకాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. జనాభా ప్రాతిపదికన చూసినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గా టీకాలు అందించింది. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు వంద శాతానికి చేరువలో వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం 180 వాహనాలలో వాక్సినేషన్ ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టి నగరంలోని ప్రతి ప్రాంతంలో వ్యాక్సినేషన్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News