న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 29,429 కొత్త కోవిడ్-19 కేసులు, 582 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,36,181కి చేరింది. వీటిలో 3,19,840 యాక్టివ్ కేసులుండగా.. 5,92,032 నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 24,309మంది కరోనాతో మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. ఎపిలో మొత్తం 33,019 మందికి కరోనా వైరస్ సోకగా… 408 మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకు 37,745 మంది కరోనా బారిన పడగా… 375మందిని కరోనా కబలించింది. అటు మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. 2,67,665 మందికి కోవిడ్ సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,695 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,07,963 యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు లక్ష యాభైవేలకు చేరువలో ఉన్నాయి. కోవిడ్ తో 2,099 మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలో 1,13,740 మందికి కరోనా పాజిటివ్ రాగా… 3,411మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 19,017 యాక్టివ్ కేసులుండగా… 91,312 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై ఐదు వేలకు చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాపుతోంది.
29429 COVID 19 cases And 582 deaths in India