న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువకు నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 15,92,421 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 29,616 ( కేరళలో 17,983) మందికి పాజిటివ్గా తేలింది. ముందు రోజుతో పోలిస్తే కేసులు 5 శాతం మేర తగ్గాయి. శుక్రవారం 28 వేల మంది కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం మరో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.36 కోట్లకు చేరగా, రికవరీలు 3.28 కోట్లు,(97.78 శాతం ) గా ఉన్నాయి. ప్రస్తుతం 3 లక్షల మందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.90 శాతానికి చేరింది. ఇప్పటివరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 4.46 లక్షలుగా ఉంది. శుక్రవారం 71 లక్షల మందికి టీకా అందింది. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 84.89 కోట్లకు చేరింది.