మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో సోమవారం విజయవాడ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాలరావుతో పాటు జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్ను అరెస్టు చేశారు. ఈక్రమంలో హోటల్ నిర్వాహకులతో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్వర్ణ ప్యాలెస్లో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చికిత్సపొందుతున్న కరోనా పేషంట్లు దుర్మరణం పాలయ్యారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ జయశ్రీ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ పేట పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు.
ఘటనపై కమిటీ పరిశీలన
అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న స్వర్ణ ప్యాలెస్ను జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ సోమవారం పరిశీలించింది. ప్రమాదం జరిగిన 3 ఫ్లోర్లను కమిటీ సభ్యులు ధ్యానచంద్, గీతాబాయి, ఉదయభాస్కర్, రమేష్ బాబు పరిశీలించారు. మూడు అంశాల ప్రాదిపదికన విచారణ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. స్వర్ణప్యాలెస్ హోటల్లో సంరక్షణ చర్యలు, కోవిడ్ నిబంధనలు.. ప్రమాద కారణంపై విచారణ చేస్తున్నామని అన్నారు. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేదా రసాయనాల వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని కమిటీ అధికారిణి గీతాబాయి తెలిపారు. విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.ఈక్రమంలో ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల నివేదికల అనంతరం ప్రమాద కారణాలపై స్పష్టత రానుంది. ఇక జెసి శివశంకర్ కమిటీతోపాటు కృష్ణా జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
3 arrested in Covid Center fire Accident Case in AP