Friday, March 29, 2024

గ్రూప్-1 పరీక్షపై హైకోర్టుకు అభ్యర్థులు..

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 పరీక్షపై మళ్లీ హైకోర్టు కెక్కిన అభ్యర్థులు
మూడు పిటిషన్‌లు దాఖలు.. దర్యాప్తు పూర్తయ్యే దాకా వద్దంటూ వినతి
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై మరోసారి సందిగ్ధత నెలకొంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీకి సంబంధించి ‘సిట్’తోపాటు ఇడి దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఎస్‌పిఎస్‌సి ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపిఎస్‌సి లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు. గతేడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతో పాటు జూన్ 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి జారీ చేసిన వెబ్ నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ అశోక్‌కుమార్ మరో నలుగురు, టి.రమేశ్, జె.సుధాకర్‌లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గతేడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చన్నారు. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దుచేసి తాజాగా నిర్వహించడానికి టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించిందన్నారు. లీకేజీ వ్యవహారంలో టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగుల పాత్ర కూడా ఉందని, పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు. ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితులందరూ ఇంకా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్ సిద్ధపడుతోందన్నారు. కేవలం ఎన్‌ఆర్‌ఐల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. పరీక్షలకు సంబంధించి 5 లక్షల మంది ఆశావహులున్నారన్నారు.

పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ వ్యవహారంలో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. దీనికి బాధ్యులైనవారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ, రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ కంట్రోలర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News