Wednesday, April 24, 2024

దసరా ‘గిఫ్ట్’

- Advertisement -
- Advertisement -

సింగరేణి కార్మికులకు లాభాల్లో 30% వాటా

సిఎం కెసిఆర్ నిర్ణయం పండుగలోగా చెల్లించాలని ఆదేశం నిరుడు కంటే ఒక శాతం
ఎక్కువ ఒకటో తేదీన అర్హులైన కార్మికులందరికీ చెల్లింపులు : సింగరేణి సిఎండి శ్రీధర్
కార్మికుల్లో ఆనందోత్సహాలు ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ సంస్థ 2021-2022 సంవత్సరానికిగాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఆ సంస్థ ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి కార్మికులకు సిఎం ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా సింగరేణి చైర్మన్,మేనేజింగ్ డైరక్టర్‌కు సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

అక్టోబర్ 1న చెల్లింపులు

గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల్లో 30 శాతం వాటాను దసరా కానుకగా ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కార్మికుల తరఫున సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది లాభాల వాటాగా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని ఆయన వివరించారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల వాటాను అక్టోబర్ 1వ తేదీన (శనివారం) చె ల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్మికుల సంక్షేమంలో సింగరేణి ఎప్పడూ ముందుంటుందన్నారు. 202122లో రి కార్డు స్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్‌ను సింగరేణి సం స్థ సాధించిందని చెప్పారు. మొత్తం టర్నోవర్‌పై రూ.1,722 కోట్ల లాభాలను సంస్థ ఆర్జించినట్లు తెలిపారు. సింగరేణి సం స్థ బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్‌పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) ఉన్నాయన్నారు.

అలాగే గతేడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. 2021-22లో స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసిందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినట్లు ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది నిర్ధేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని, తద్వారా రికార్డు స్థాయి టర్నోవర్, లా భాలు సాధించవచ్చని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నారు.

193 శాతానికి పెరిగిన లాభాలు

ఉమ్మడి ఎపిలో 2013-14లో 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ 2021-22 నాటికి 29 శాతం వృద్ధితో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 2013-14లో 479 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన కంపెనీ 202122 నాటికి 37శాతం వృద్ధితో 655 లక్షల టన్నుల రవా ణా జరిపింది. 201314లో రూ.11,928 కోట్లుగా ఉన్న అమ్మకాలు 123 శాతం వృద్ధి తో గతేడాదికి 26,607 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాభాలతో పాటు గరిష్టంగా 193 శాతానికి పెరిగాయి. 2013-14లో రూ.419 కోట్ల నికర లాభం సాధించగా, 2021-22 నాటికి 1,227 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది.

ఉత్సాహాంగా పనిచేసిన కార్మికులు

సింగరేణి కార్మికులతో ప్రభుత్వం రెండుసార్లు బహిరంగ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అనేక పథకాలు ప్రకటించగా, సిఎండి ఎన్.శ్రీధర్ ఈ పథకాలను తక్షణమే అమలు జరిపేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కార్మిక వర్గం మరింత ఉత్సాహంతో పనిచేస్తూ సింగరేణి లాభాల వైపు పయనించేలా తమవంతు కృషి చేశారు.

కారుణ్య నియామకాల పథకాలు అమల్లోకి….

రెండు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాల పథకాన్ని సింగరేణి అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే ఆయన ఆదేశంపై కార్మికులకే కాకుండా వారి తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం, సొంతంగా ఇళ్లు నిర్మించుకొన్న కార్మికులకు రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు, క్వార్టర్లకు ఏసి సౌకర్యం, ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబానికి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ మొత్తాన్ని 10 రెట్లకు పెంచడం, కార్మికులు చెల్లించే కరెంట్ చార్జీలు రద్దు చేయడం, ఉన్నత చదువులో ఉన్న కార్మికుల పిల్లలకు కంపెనీ నుంచే ఫీజు చెల్లించడం, లాభాల బోనస్, పండుగ అడ్వాన్సు పెంపుదల, క్యాంటీన్ల ఆధునీకరణ మొదలైన అనేక సంక్షేమ చర్యలు కార్మికులకు ఎంతో సంతోషం కలిగిస్తున్నాయి.

కార్మికులు మరిన్ని లక్ష్యాలు సాధించాలి

ఈ సందర్భంగా సిఎండి ఎన్.శ్రీధర్ కార్మికులకు అభినందనలు తెలుపుతూ ఇదే ఒరవడితో కృషిచేస్తూ 2022-23 సంవత్సరానికి నిర్ధేశించిన లక్ష్యాలు సాధించాలని తద్వారా మరిన్ని లాభాలు, సంక్షేమం సాధించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. మరోమారు ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

కెసిఆర్ చిత్రపటానికి సింగరేణి కార్మికుల పాలాభిషేకం

మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: సిఎం కెసిఆర్ చిత్రపటానికి సింగరేణి కార్మికులు బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేశారు. సింగరేణి సంస్థలో 202122 సంవత్సరానికిగాను లాభాల వాటాలలో 30శాతం 368కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు అందించేందుకు నిర్ణయించడం పల్ల కార్మికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సింగరేణి కార్మికులు టిబిజికెఎస్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిజిబికెఎస్ నాయకులు కోక్కుల తిరుపతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మిక పక్షపాతి అని అన్నారు. గతంలో 16శాతం లాభాలవాటలో సింగరేణి కార్మికులకు అందించేవారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 16శాతం నుంచి 30శాతానికి పెంచిన చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌ది అని అన్నారు. దసరా పండుగ కానుకగా సింగరేణి కార్మికులకు లాభాల వాటలో 30శాతం అందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పలువురు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News