మనతెలంగాణ/ధర్మారం: అకాల వర్షం, పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన ధర్మారం మండలం శాయంపేటలో చోటుచేసుకుంది. సాయంపేటకు చెందిన ఆకుల భూమయ్య తన గొర్రెలను మేపేందుకు వెళ్ళి వర్షం రావడంతో చెట్టు నీడన నిలబడగా పిడుగు పడటంతో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 2 లక్షల విలువ చేసే గొర్రెలు మృతి చెందడంతో బాధితుడు భూమయ్య తీవ్ర ఆవేదన చెందాడు.
మరోవైపు భారీ వర్షం మూలంగా నల్లలింగయ్యపల్లిలోని ప్రజలందరికి ఉపయోగపడే మంచినీటి బావి పూర్తిగా వర్షం నీటిలో కూరుకుపోయింది. దీంతో నల్ల లింగయ్యపల్లిలోని గ్రామ ప్రజలు మంచి నీటికోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం, ఈదురు గాలులతో ఖిలావనపర్తిలోని లక్ష్మినరసింహస్వామి ఆలయం వద్ద చెట్లు నేలమట్టం కాగా, మామిడి కాయలు నేల రాలిపోయాయి. మరో వారం రోజుల్లో పూర్తిగా మామిడి కోతలు పూర్తవుతుండగా, చివరి దశలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు మామిడి కాయలు నేలపాలు కావడంతో మామిడి రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
30 Sheeps dead due to Thunderstorms