పండుగ దృష్టా ప్రత్యేకరైళ్లను నడపనున్న దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణమధ్య రైల్వే గుడ్న్యూస్ అందించింది. పండుగ దృష్టా ప్రత్యేకరైలు సర్వీసులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వివిధ రూట్లలో నడుస్తున్న 30 స్పెషల్ రైళ్లను మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి టు లింగంపల్లి, కాకినాడ టు లింగంపల్లి, నర్సాపూర్ టు లింగంపల్లి, హైదరాబాద్ టు తిరువనంతపురం, సికింద్రాబాద్ టు సిర్పూర్ టు కాగజ్నగర్, హైదరాబాద్ టు జైపూర్, హైదరాబాద్ టు రెక్సాల్, కాచిగూడ టు మైసూర్, హైదరాబాద్ టు ఔరంగాబాద్, హైదరాబాద్ టు తాంబరం, సికింద్రాబాద్ టు రాజ్కోట్ మొదలగు రూట్లలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మార్చి నెలాఖరుదాకా నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సికింద్రాబాద్ టు కాకినాడల మధ్య, జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కాకినాడ టౌన్ టు తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడపనుంది.