హైదరాబాద్ ః నగరంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శనివారం నిర్వహించిన దాడుల్లో ఆర్జిఐ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీషాప్ ఉద్యోగి సందీప్ కుమార్, జిఎస్టి హవల్దార్ కుతాది మల్లేష్ల నుంచి 31 బాటిళ్ల విదేశీ మద్యంతో పాటు డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల అంజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అబిడ్స్ సమీపంలోని తాజ్మహల్ హోటల్ వద్ద ఆర్జిఐ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్ ఉద్యోగి రంగా సందీప్ కుమార్ తన హోండా యాక్టివ్ వాహనంలో అక్రమంగా విదేశీ మద్యం తరలిస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేపట్టామన్నారు.
దీంతో అతని వాహనంలో ఉన్న 12 బాటిళ్లు (చివాస్ రీగల్, విదేశీ మద్యం) స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈక్రమంలో నిందితుడు సందీప్కుమార్ విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని పికెట్లో నివాసముంటున్న కుతాది మల్లేష్ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో 15 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయన్నారు. మల్లేష్ ఇంట్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 11 జానీవాకర్ గోల్డ్లేబుల్, 4 డిఫెన్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే అతని నుంచి 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా నిందితుడు కూతాది మల్లేష్ ప్రస్తుతం జిఎస్టిలో హవల్దార్గా పనిచేస్తున్నాడని, గతంలో ఆర్జిఐ ఎయిర్పోర్ట్లో పనిచేశాడని విచారణలో తేలిందన్నారు.
నిందితులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విదేశీ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి, హైదరాబాద్ నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను, వారినుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు, సెల్ఫోన్లు, హోండా యాక్టివ తదితర వస్తుసామాగ్రిని నారాయణగూడ ఎక్సైజ్ స్టేషష్కు అప్పగించడం జరిగిందన్నారు. ఎక్సైజ్ డిసి వివేకానందరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పి. నరేందర్, జె.రవి సిఐలు, నిజాముద్దీన్, దామోదర్ ఎస్ఐలు అజీమ్, శ్రీధర్ హెచ్సిలు కరన్సింగ్, కృష్ణ, గోపాల్, శ్రీనివాస్, సాయిలు దాడుల్లో పాల్గొన్నారని ఎఇఎస్ అంజిరెడ్డి వివరించారు.