మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలో వరుసగా వైరస్ సోకడం ఆందోళన కల్గిస్తుంది. గడిచిన మూడు రోజుల్లో 15 పాజిటివ్ కేసులు రావడం ప్రజలతో పాటు అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి…కొకాపేట్ కి చెందిన 49 ఏళ్ల వ్యక్తి ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చాడు. అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. అదే విధంగా చందానగర్లో నివసించే 39 ఏళ్ల మహిళ జర్మనీ నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చింది. అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ తేలిందని వైద్యులు బులిటెన్తో తెలిపారు. బేగంపేటకి చెందిన వృద్ధురాలు (61) సౌది అరేబియా నుంచి తిరిగి రావడంతో ఆమెకూ వైద్యులు కరోనా టెస్టులు నిర్వహించగా కొవిడ్ 19 సొకినట్లు తేల్చారు. అయితే మంగళవారం ఒక్క రోజు మూడు కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో 36 కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.