Tuesday, April 16, 2024

కరోనా విజృంభిస్తున్న గుంపులుగా జనం

- Advertisement -
- Advertisement -

400 covid positive cases in hyderabad

నగరంలో కనిపించని కోవిడ్ నిబంధనలు
షాపింగ్‌మాల్స్,పండ్లు, కూరగాయల మార్కెట్‌ల్లో జనం రద్దీ
బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి పోతున్న ప్రయాణికులు
నిబంధనలు పాటించకుంటే పోర్త్‌వేవ్ తప్పదని వైద్యశాఖ హెచ్చరికలు

హైదరాబాద్: నగరంలో గత పదిరోజులుగా కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చుతూ రోజుకు వందలాదిమందిని ఆసుపత్రుల బాట పట్టిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్‌లో పాజిటివ్ కేసులు సంఖ్య 400లకు చేరాయి. అయిన ప్రజలు వైరస్ పట్ల నిర్లక్షం చేస్తూ ముఖానికి మాస్కులు ధరించకుండా గుంపులుగా సంచారం చేస్తూ కరోనాకు రెక్కలు తొడుగుతున్నారు. ఐదారు రోజుల కితం వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని లేకుంటే మహమ్మారి వేగంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. అదే విధంగా సెకండ్ డోసు, బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోని వారంతా సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవాలని కోరుతున్నారు. కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, అబిడ్స్, కోఠి, దిల్‌షుక్‌నగర్, రాణిగంజ్, బేగంబజార్, గచ్చిబౌలిలో షాపింగ్ మాల్స్, వస్త్ర, బంగారు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, పాఠశాలలలో పెద్ద సంఖ్యలో తిరుగుతూ భౌతికదూరం పాటించడంలేదు. కనీసం మాస్కులు ధరించాలనే నోటీసులు కూడా పెట్టడంలేదు. ప్రధాన ద్వారాల కూడా సెక్యూరిటీ సిబ్బంది కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.

ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే విధంగా ప్రజలు ఇష్టానుసారంగా తిరిగితే పోర్త్‌వేవ్ రెచ్చిపోతుందని,మళ్లీ లాక్‌డౌన్ వచ్చే పరిస్థితి వస్తుందని, ఇప్పటి నుంచే వైరస్ పట్ల నియంత్రణ చర్యలు చేపడితే విస్తరించకుండా ఉంటుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. గత వారం రోజులుగా నమోదైన పాజిటివ్ కేసులు చూస్తే ఈనెల 18వ తేదీన 157 కేసులు, ఈనెల 19న 180మందికి, ఈనెల 20వ తేదీన 185, ఈనెల 21న 240 కేసులు, ఈనెల 22వ తేదీన 292 మందికి, ఈనెల 23న 315 కేసులు, ఈనెల 24వ తేదీన 366 నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజలు పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు. కోవిడ్ సోకే ప్రమాద ఎక్కువ ఉన్న 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సువారు బయటకు వెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్ గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి పనులకు వెళ్లవద్దని జిల్లా వైద్యశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News