మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు శుభవార్త. (ఎర్లీబర్డ్) గడువును ప్రభుత్వం మరో నెల రోజులు (మే 31) వరకు పొడిగించింది. ప్రతి ఏటా ఏఫ్రిల్ నెలలో ఎర్లీ బర్ట్ కింద ముందస్తు ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి 5 శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా జిహెచ్ఎంసి ముందుస్తూపన్నులు వ సూళ్ల రూపంలో ఆదాయం రావడంతో పాటు అటు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు సైతం 5 శాతం రాయితీ లభిస్తుండడంతో ప్రతి ఏటా అంతకంతా ఆదారణ పెరుగుతోంది.
ఈ ఏడాది కూడా గత నెల ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ పథకాన్ని జిహెచ్ఎంసి అమలు చేసింది. అయితే ఏప్రిల్లోనే గ్రేటర్లో కరోనా విజృంభించడం, ఈనెలలోనే 20వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. దీంతో నగరవాసులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయ్యారు. 30 రోజుల్లో జిహెచ్ఎంసికి రూ.363 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ ఎర్లీబర్డ్ స్కీమ్ను మరో నెల రోజుల పాటు పొగడించాలని కోరుతూ జిహెచ్ఎంసి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
అయితే కరోనా నేపథ్యంలో దీంతో ప్రభుత్వం మే 31వరకు పొగిస్తూ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. తద్వారా నగరవాసులకు మరో నెల వెసులుబాటు కలిగింది. ఎర్లీబర్డ్ కింద బల్దియాకు 2020లో ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు రూ.575.07 కోట్లు వసూళ్లు కాగా, 2019లో సైతం ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు రూ.574.88 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా కనీసం రూ. 700 కోట్లు వస్తాయనే అంచనాలో ఉన్న అధికారులు గడిచిన 30 రోజుల్లో రూ.363 కోట్ల రాగా, మరో నెల రోజులు పొడగించడంతో నిర్దేశిత లక్షాన్ని చేరుకుంటామనే అశాభావం వ్యక్తం చేస్తున్నారు.