Friday, March 29, 2024

కేశవానంద భారతి కేసు తీర్పుకు 50 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యాంగ లిక స్వరూపం, పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించి అత్యంత కీలకమైన కేసుగా కేశవానంద భారతి కేసు న్యాయచరిత్రలో నిలిచింది. కేరళ భూసంస్కరణల చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఆ కేసులో వచ్చిన తీర్పు ఆ తర్వాత ఎన్నో కేసులకు దిక్సూచిగా నిలిచింది.‘ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో తీర్పు వెలువడి ఏప్రిల్ 24వ తేదీతో 50 ఏళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేసులో వాదోపవాదాలు,తిఖితపూర్వక ప్రతులతో పాటుగా చారిత్రక తీర్పుతో ఒక ప్రత్యేక వెబ్ పేజీని సుప్రీంకోర్టు రూపొందించింది. ‘ యావత్ ప్రపంచ పరిశోధకులు చూసేందుకు వీలుగా కేశవానంద కేసుకు సంబంధించి ఉన్న అన్ని లిఖిత పూర్వక ఫైళ్లతోకూడిన ఓ వెబ్‌పేజీని ఏర్పాటు చేశాం. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున( ఏప్రిల్ 24న) ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడింది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొనగానే కోర్టుహాలులో ఉన్న న్యాయవాదులంతా హర్షధ్వానాలు చేశారు.పరిశోధకులు, విద్యార్థులు, న్యాయవాదులకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ఇందులో భాగంగా పార్లమెంటు చేసిన 24, 25, 29 రాజ్యాంగ సవరణల చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ సవరణలు న్యాయవ్యవస్థ అధికారాలతో పాటుగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై 1972 అక్టోబర్ 31న ప్రారంభమైన విచారణ 1973 ఏప్రిల్ 24 వరకు కొనసాగింది. అప్పట్లో ఈ కేసును 13 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారించింది. ఒక కేసు కోసం 13 మంది న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలోనే ప్రథమం. అయితే విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు, మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు ఉందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 68 రోజుల సుదీర్ఘ విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు అని చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఏ విషయంలోనైనా సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక స్వరూపాన్ని మార్చలేదని స్పష్టం చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం వాటి సంరక్షణ బాధ్యత చూస్తుందని పేర్కొంది. దీని అర్థం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య, చట్టం అందరికీ సమానం వంటి రాజ్యాంగ మౌలిక సూత్రాల స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News