దేశంలో కరోనా కేసులు తగ్గాయి
కొత్తగా 53,601 మందికి వైరస్, 871 మరణాలు
45 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగు రోజులుగా 60,000కు పైగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు మంగళవారం కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,68,675కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ఇప్పటి వరకు 15,83,489 మంది కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోగా, మరో 6,39,929 మంది చికిత్స పొందుతున్నారు. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 871 మంది వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన కరోనా బాధితుల సంఖ్య 45,257కు చేరుకుంది. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,45,83,558 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వాహించారని, సోమవారం ఒక్క రోజే 4,77,023 శాంపిల్స్ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలిపింది.
కాగా, తాజా మరణాల్లో మహారాష్ట్రలో 293 మంది మరణించగా, తమిళనాడు, కర్నాటకలలో 114 మంది చొప్పున చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో 80, యుపిలో 51, పశ్చిమ బెంగాల్లో 41, ఢిల్లీ, గుజరాత్లలో 20 చొప్పున మరణాలు సంభవించాయి. కాగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 18,050 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా తమిళనాడులో 5,041, ఢిల్లీలో 4,131 మంది, కర్నాటకలో 3,312 మంది, గుజరాత్లో 2,672 మంది, యుపిలో 2,120 మంది, ఆంధ్రప్రదేశ్లో 2,116 మంది, పశ్చిమ బెంగాల్లో 2,100, మధ్యప్రదేశ్లో 1,015 మంది కరోనా రోగులు మృతి చెందారు.
ప్రముఖ హిందీ కవి రాహత్ మృతి
కాగా ఇటీవల కరోనా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ హిందీ కవి రాహత్ ఇండోరి మంగళవారం గుండెపోటుతో చనిపోయినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. ‘మంగళవారం ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఎంతగా శ్రమించినా ఆయనను కాపాడలేకపోయాం. ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు 60 శాతం న్యుమోనియా ఉంది’ అని ఇండోర్లోని శ్రీఅరబిందో ఆస్పత్రికి చెందిన డాక్టర్ వినోద్ భండారి తెలిపారు. ఆస్పత్రిలో చేరడానికి ముందు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ ద్వారా తెలిపిన ఆయన తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని తన అభిమానులను కోరారు. తనకు ఎవరూ ఫోన్ చేయవద్దని, తానే తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వార తెలియజేస్తానని కూడా తెలిపారు.
53601 New Corona Cases Registered in India