Thursday, April 25, 2024

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షకు 77,907 మంది హాజరు

- Advertisement -
- Advertisement -

77,907 appeared for written exam of Singareni Junior Assistant

8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో రాత పరీక్ష ప్రశాంతం
అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 89 శాతం,
అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 64 శాతం అభ్యర్థుల హాజరు
పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను తనిఖీ చేసిన డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, జిఎంలు
నేడు ఉదయం కీ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 79 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం 98,882 మందికి సింగరేణి సంస్థ హాల్ టికెట్లు జారీ చేయగా వారిలో 90,928 మంది మాత్రమే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా అందులో 77,907 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సింగరేణి సంస్థ నుంచి 200 మందికి పైగా ఉన్నతాధికారులను చీఫ్ కో ఆర్డినేటర్లుగా, కో ఆర్డినేటర్లుగా నియమించి పరీక్ష సజావుగా జరిగేలా సింగరేణి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెంలో 87.31 శాతం

మంచిర్యాల జిల్లాలో 7,875 (88.62 శాతం) మంది అభ్యర్థులు, భద్రాద్రి కొత్తగూడెంలో 12,079( 87.31 శాతం) మంది అభ్యర్థులు, వరంగల్ లో 9,221(84.6 శాతం), కరీంనగర్‌లో 16,286 (82.09 శాతం), ఖమ్మంలో 9,915 (81.35 శాతం), హైదరాబాద్‌లో 19,813 (68.28 శాతం) మంది హాజరు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2,718 (64.42 శాతం) మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.

8 జిల్లాల్లో పరీక్షల ఏర్పాట్లు

డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కరీంనగర్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించగా, హైదరాబాద్‌లో జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ పరీక్ష కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే ఏరియా జనరల్ మేనేజర్లు కార్పొరేట్ జిఎంలు తమ పరిధిలోని పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటు పాట్లు తలెత్తకుండా చూశారు. జిఎం(రిక్రూట్‌మెంట్) కె.బసవయ్య హైదరాబాద్ కేంద్రంగా కంట్రోల్ రూం నుంచి 8 జిల్లాల్లో జరిగిన పరీక్ష ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సీనియర్ అధికారులు ప్రతి సెంటర్‌కు కో ఆర్డినేటర్లుగా వ్యవహారించి పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు.

రేపు రాత పరీక్ష కీ విడుదల : డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్

ఆదివారం జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష కు సంబంధించిన ఎ, బి, సి, డి ప్రశ్నపత్రాలకు సంబంధించిన కీ ను సోమవారం ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్‌సైట్ https://scclmines.com/ అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే బుధవారం (సెప్టెంబరు 7వ తేదీ) ఉదయం 11 గంటల లోపు సింగరేణి వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.. అలాగే వారి అభ్యంతరాలకు సంబంధించి పూర్తి ఆధారాలను వెబ్ సైట్‌లో (అప్‌లోడ్ చేస్తే) వాటిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News