మన తెలంగాణ/హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఐఎఎస్లను, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు వేర్వేరు ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. వీటి ప్రకారం 2018 బ్యాచ్కు చెందిన ఎనిమిది మంది ఐఎఎస్లకు కొత్తగా పోస్టింగ్లు ఇస్తూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమించారు. అలాగే తొమ్మిది మంది నాన్ క్యాడర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా బదిలీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెంకు అనుదీప్ దురిశెట్టి, జోగులాంబ గద్వాలకు కోయ శ్రీహర్ష, మహబూబాబాద్కు అభిలాష అభినవ్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సత్యప్రసాద్, పెద్దపల్లి జిల్లాకు కుమార్ దీపక్, ములుగు జిల్లాకు అదర్శ్ సురభి, నిర్మల్ జిల్లాకు భోర్ఖాడే హేమంత్, మహబూబ్నగర్కు తేజస్ నందలాల్ పవార్ మొత్తం తొమ్మిది మందిని ఎనిమిది జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా సిఎస్ నియమించారు.
బదిలీ అయిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్లలో సిసిఎల్ అసిస్టెంట్ సెక్రటరీ కోట శ్రీ వాస్తవ వనపర్తికి, జగిత్యాల డిఆర్ఒ జల్ద అరుణశ్రీ జగిత్యాలకే, తెలంగాణ సాహిత్య అకాడామీ సెక్రటరీ అనుగు నర్సింహారెడ్డి కరీంనగర్కు, ఆదిలాబాద్ డిఆర్ఒ నటరాజ్ కొత్తగూడెం ఆసిఫాబాద్కు, జయశంకర్ భూపాలపల్లి ఆర్డిఒ వై.వి గణేష్ అదే జిల్లాకు, మెదక్ డిఆర్ఒ బి. వెంకటేశ్వర్లు అదే జిల్లాకు, నారాయణపేట అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి యదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కందూరి చంద్రారెడ్డిని నారాయణపేట జిల్లాకు, జి.పద్మజా రాణి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్గా నియమించారు.
8 IAS Officers get Posting as Additional Collectors in TS