30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’
అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు
ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం నాడు జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్లో సుమారు 1500 మంది డిఆర్జి బలగాలు, 500 మంది కోబ్రా బెటాలియన్ జవాన్లు పాల్గొన్నారు. బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ కొనసాగింది. ఈనేపథ్యంలో కసాల్పవాడ్ అటవీ ప్రాంతంలో భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్ ఘటనాస్థలంలో మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ప్రహార్లో భాగంగా భద్రతా బలగాలు బృందాలుగా దండకారణ్యంలో సుమారు 30 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోయి సెర్చ్ ఆపరేషన్ నిర్వంచినట్లు తెలిసింది.
బుల్లెట్ఫ్రూఫ్ జాకెట్లతో మావోయిస్టులు
ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన అనంతరం సుక్మా ఎఎస్పి సిద్దార్థ్ తివారీ సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆసక్తికర విషయాలను వెల్లడయ్యాయి. మావోయిస్టులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు ధరించారని ఎన్ కౌంటర్ లో మావోయిస్టులను దగ్గరగా చూసిన సిఆర్పిఎఫ్, కోబ్రా సభ్యులు ఎఎస్పి సిద్దార్థ్ తివారి దృష్టికి తెచ్చారు. భారీ సంఖ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు మావోయిస్టుల వద్ద ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం. అంతేకాకుండా, యుబిజిఎస్ అత్యాధునిక అండర్ బేరల్ గ్రెనేడ్ లాంఛర్లు కలిగి ఉన్నారని ఎదురుకాల్పుల్లో పాల్గొన్న సిఆర్పిఎఫ్, కోబ్రా దళ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, గత రెండు రోజులుగా సుక్మా జిల్లా కిష్టారం ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇరు పక్షాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ నెల 18న ఒక జవాన్ ని వారు కాల్చి వేశారు. ఆ మరుసటి రోజు మావోయిస్టుల సానుభూతిపరుడు ఒకరిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. కాగా సుక్మా జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్తో మృతి చెందడంతో సరిహద్దు ప్రాంతమైన తెలంగాణలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
8 Maoists killed in Chhattisgarh border Encounter