కశ్మీర్లో 8మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బలగాలు
శ్రీనగర్ : జమ్మూ, కశ్మీర్లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్, షోపియాన్ జిల్లాలోని మునంద్ బండ్పావా ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు భద్రతా దళాలకు గురువారం పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగి నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. పాంపోర్లో ముగ్గురు మిలిటెంట్లు ఒక ఇంట్లో దాగి ఉన్నట్లు గుర్తించిన సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డంతో భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. దీంతో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే హతమైనాడు.
మిగతా ఇద్దరు పారిపోయి ఓ మసీదులో దాక్కున్నారు. దీంతో భద్రతా దళాలు రాత్రివేళ ఆ మసీదును చుట్టుముట్టాయి. శుక్రవారం తెల్లవారుజాము సమయంలో భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దీంతో దట్టమైన పొగ కమ్మేయడంతో మిలిటెంట్లు మసీదులోంచి బైటికి వచ్చి భద్రతా దళాలపై కాల్పులు జరపడం ప్రారంభించాయి. ఎదురు కాల్పులు జరిపిన బలగాలు వారిని అక్కడిక్కడే మట్టుబెట్టాయి. మసీదు పవిత్రతకు ఎలాంటి భంగం కలిగించకుండా ముష్కరులను మట్టుబెట్టామని కశ్మీర్ ఐజి విజయ్ కుమార్ చెప్పారు. ఇక షోపియాన్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో గురువారంనుంచి ఐదుగురు మిలిటెంట్లను మట్టుబెట్టారు. వీరంతా ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.