త్వరలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందుబాటులోకి..
ప్పటికే 22 భవనాల నిర్మాణాలు పూర్తి
మరో 39 భవనాల పనులు తుదిదశకు
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సొంత భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.64 కోట్లతో 87 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మ్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 22 భవనాల నిర్మాణాలు పూర్తికాగా మరో 39 భవనాల పనులు తుదిదశకు చేరుకున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. మరో 15 భవనాల నిర్మాణాలు దాదాపు సగం పూర్తయ్యాయని మిగతా పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు.
చాలా ఏళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలు, ఇరుకగదుల్లో విధులను సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనలు మేరకు సిఎం కెసిఆర్ ఈ భవనాల నిర్మాణాలను నిధులను కేటాయించారు. అందులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 8 కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగతావన్నీ అద్దెభవనాల్లో, ఇరుకుగదుల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు, అధికారులు ఇబ్బందిపడేవారు. ఈ నేపథ్యంలో కొత్త నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది.