మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం నిర్వహించిన 3,006 టెస్టుల్లో 879 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. అంటే పాజిటివ్ రేట్ 29.24కి పెరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సుమారు 80 శాతం హైదరాబాద్లో నమోదుకావడం భయబ్రాంతులకు గురిచేస్తుంది. జిహెచ్ఎంసి పరిధిలో హైర్కిస్క్ ఉన్నట్లు ఇటీవల సిసిఎంబి శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించడం మరింత భయాందోళనలు కలిగిస్తుంది. కొత్తగా 879 కేసులు నమోదుకాగా, ముగ్గురు వ్యక్తులు మరణించారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇవే గరిష్ఠం కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో 652 ఉండగా, జిల్లాల్లో 227 మందికి వైరస్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9553 కి చేరగా, ఇప్పటి వరకు ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 4224కి పెరిగింది. అదే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 5109కి చేరుకుంది.
వైరస్ దాడిలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 220కి పెరిగింది. మంగళవారం వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలో 652 మంది ఉండగా, రంగారెడ్డిలో 64, మేడ్చల్ 112, జనగాం 7, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్ 14, మంచిర్యాల 2, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్ 9, మహబూబాబాద్ 2, మెదక్ 1, నాగర్ కర్నూల్ నలుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో అసెంబ్లీలో పనిచేసే ఓ మార్షల్ ఉన్నారు. అదే విధంగా టివి సీరియల్ పనిచేసే నటుడికీ వైరస్ తేలింది. దీంతో వెంటనే షుటింగ్ నిలిపివేసినట్లు నిర్మాత ప్రకటించారు. ఈ నటుడు తిరుపతి నుంచి నేరుగా షుటింగ్కి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బస్భవన్లో పనిచేసే ఇద్దరు అధికారులకూ వైరస్ తేలింది. దీంతో హైదరాబాద్లో జరగాల్సిన ఏపి, టిఎస్ ఆర్టీసి ఉన్నతాధికారుల సమావేవం వాయిదా పడింది. హైదరాబాద్ శివారు ప్రాంతం మేడిపల్లిలో పిటి కాలనీలో కోవిడ్ కలకరం రేపింది. ఓ అపార్ట్మెంట్లో ఒకరికి వైరస్ రావడంతో ప్రాగణమంతా శానిటేషన్ చేశారు. అదే విధంగా నల్గొండ జిల్లాలో పదిఏళ్ల బాలుడికి వైరస్ తేలింది. అదే విధంగా మాజీ ఎంపి వి హనుమంతురావు సతిమణికి, అతని డ్రైవర్కు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
63వేలు దాటిన టెస్టులు సంఖ్య..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 63,249కి చేరింది. వీటిలో 53696 మందికినెగటివ్ వస్తే, 9553 మందికి పాజిటివ్ తేలింది. వీటిలో 5109 యాక్టివ్ కేసులు ఉండగా, 4224 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వైరస్ దాడిలో 220 మంది చనిపోయారు. అయితే టెస్టులు సంఖ్య పెరగడంతోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
879 New Corona Cases Reported in Telangana