ఎన్సిపిలో చేరనున్న ఏక్నాథ్ ఖడ్సే
ముంబయి: బిజెపి సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఆయన శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి)లో చేరుతున్నారని ఎన్సిపి రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ శుక్రవారం ప్రకటించారు. బిజెపిని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఖడ్సే తనకు కొద్ది కాలం క్రితం చెప్పారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో బిజెపి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ఏక్నాథ్ ఖడ్సే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని, శుక్రవారం మధ్యాహ్నం ఆయన లాంఛనంగా ఎన్సిపిలో చేరుతున్నారని పాటిల్ తెలిపారు. ఖడ్సే మద్దతుదారులైన పలువురు బిజెపి ఎమ్మెల్యేలు, నాయకులు ఎన్సిపిలో చేరాలని భావిస్తున్నారని, అయితే వారి చేరికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పాటిల్ తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ఈ క్లిష్ట కాలంలో ఎన్నికలు జరగాలని తాము భావించడం లేదని, ఇతర నాయకుల చేరికపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా ఉండగా..రాజకీయ పునరావాసాన్ని కోరుకుంటున్న ఖడ్సే ప్రభుత్వ కోటాలో ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని ఆశిస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు. శాసన మండలికి 12 మంది సభ్యుల నియామకం విషయమై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సిఫార్సు చేయడంపై శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.