రాజ్ పథ్ పరేడ్లో తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతం
బతుకమ్మ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర,
వేయి స్తంభాల గుడి థీమ్తో రూపొందిన శకటాలు
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ వద్ద నిర్వహించిన పరేడ్లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. ఢిల్లీ వేదికగా మరోసారి తెలంగాణ సంస్కృతీ, వైభవం ఆవిష్కృతమయ్యింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క- సారాలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్తో రూపొందించిన శకటం ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది. గిరిజన కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను చాటి చెప్పేలా గొండి, తోటి, ప్రదాన్, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఐదేండ్ల తర్వాత మరోసారి అవకాశం
తెలంగాణ ఏర్పడ్డాక 2015 లో తొలిసారి తెలంగాణ తరఫున శకటం ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. ఐదేండ్ల తర్వాత మరోసారి తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్రం వచ్చాక శకటాన్ని ప్రదర్శించడం ఇది రెండవసారి. 9 రోజుల పాటు ఘనంగా సాగే బతుకమ్మ పండుగతో పాటు తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మ వైభవం చాటేలా శకటాన్ని తయారు చేశారు. దీంతో పాటు కాకతీయ చరిత్రను ప్రతిబింబించేలా వెయ్యి స్థంభాల గుడిని సైతం అందంగా రూపొందించారు. అనంతరం వచ్చిన ఆంధ్రపదేశ్ ఏడుకొండల వెంకన్న సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల మహాత్యాన్ని చాటాయి. శకటంపై రూపొందించిన తిరుమల తిరుపతి గర్భగుడి, బ్రహ్మోత్సవం.. బ్రహ్మోత్సవం అంటూ సాగిన సంకీర్తన గణతంత్ర వేడుకల్లో భక్తిపారవశ్యాన్ని చాటాయి.