మన తెలంగాణ/జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం మహిభత్పూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వస్తాపూర్ చౌరస్తా ప్రాంతంలో ఓ మహిళపై జరిగిన అత్యాచారం సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు గంగ్వర్ చౌరస్తాలో తలదాచుకున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు.
పోలీలు వెంబడిస్తున్నారన్న భయంతో కారును వేగంగా నడపడంతో మహిభత్పూర్ శివారులో కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అత్యాచార నిందితుల్లో సోమ చారి (45) అనే వ్యక్తి ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మరో నిందితుడు బ్రహ్మచారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బ్రహ్మచారి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో నిందితుడు పవన్ కుమార్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.