ప్రైవేటు కళాశాలలకు విద్యాశాఖ హెచ్చరిక
గుర్తింపులేని కాలేజీలకూ నోటీసులు
హైదరాబాద్ : నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి కార్యదర్శి ఉమర్ జలీల్, ఇతర ఉన్నతాధికారులు శనివారం ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఇప్పటికే కళాశాలల్లో తనిఖీలు పూర్తి చేశామని, వచ్చే విద్యాసంవత్సరం నిబంధనలు పాటించకపోతే కళాశాలలు మూసివేస్తామని అధికారులు యాజమానాలకు స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. 79 కళాశాలలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, సదరు కాలేజీలను అన్ని వసతులు ఉన్న భవనాల్లోకి మార్చాలని అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని 79 కళాశాలలకు నోటీసులు జారీ చేశామన్నారు.
అలాగే గుర్తింపు లేని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు కళాశాలలకు నోటీసులు ఇచ్చినట్లు ప్రకటించారు. నోటీసులకు స్పందించకుంటే కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల అమలుకు సహకరించాలని యాజమాన్యాలను కోరామని పేర్కొన్నారు. కొన్ని కళాశాలలకు అగ్నిమాపక అనుమతి లేదని, మరికొన్ని కళాశాలలు అనుమతి లేకుండా మరోచోట నడుపుతున్నారని అన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సమావేశంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.