Thursday, April 25, 2024

తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే హక్కు నిర్మాతకు ఉంది

- Advertisement -
- Advertisement -

 

Active Telugu Film Producers Guild Strong Counter To Theatre Association

 

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ ఆఫీసర్ బేరర్స్ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. తాము నిరించిన చిత్రాలను ఎప్పుడైనా విడుదల చేసుకునే హక్కు నిర్మాతకి ఉందని ప్రొడ్యూసర్ గిల్డ్ తెలియజేసింది. ఇటీవల తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ సమావేశమై కొన్ని పెద్ద చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయని… అక్టోబర్ వరకు వేచి చూడాలని, అప్పటికీ పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు నిర్మాతలు ఓటీటీలో సినిమాలను విడుదల చేసుకోవచ్చని థియేటర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఒకవేళ అలా చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ చెప్పింది. ఈ విషయంపై యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ స్పందించింది. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. “తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాత ఎల్లప్పుడూ భావిస్తాడు.

గతంలో శాటిలైట్, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో… ఈ మార్గాలు అన్నింటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది. ఓటీటీ మాద్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. తన చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందువల్లే పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది. నిర్మాతలు, హీరోలు, సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒంటరి కాకూడదు. ఏ సెక్టార్ చేత వెలివేయబడకూడదు. పరిశ్రమ ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలకు సహాయపడమని వివిధ వేదికల్లో ఎగ్జిబిటర్లకు మేం విజ్ఞప్తి చేశాం. ఇవాళ ఎగ్జిబిటర్లు కేవలం విపరీతమైన డిమాండ్ ఉన్న సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న, ఓ మాదిరి చిత్రాలను పట్టించుకోవడం లేదు. వాటిని విస్మరిస్తున్నారు.

దాంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి. నిర్మాతల మనుగడను ఎవరూ, ఏ రంగమూ నిర్దేశించకూడదు, బెదిరించకూడదు. పరిశ్రమలో పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు వివిధ వ్యాపార భాగాస్వాములు. పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేం బాధపడుతున్నాం. పరస్పర మద్దతు ఆశిస్తున్నాం. మనం ఎదుర్కొంటున్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి”అని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News