న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని శాస్త్రినగర్లో తన పినతల్లి ఇంట్లో నివసిస్తున్న బాలీవుడ్ నటి నికితా రావల్ను దుండగులు తుపాకీతో బెదిరించి రూ. 7లక్షలు దోచుకున్నారు. “ నేనింకా షాక్ నుండి తేరుకోలేదు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఈ దోపిడి జరిగింది. వాస్తవానికి నన్ను నేను వార్డ్రోబ్లో బంధించుకున్నాను ” అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రొడ్యూసర్ రాజ్ కుంద్రా అరెస్టుపై ఆమె లెహ్రే టివిలో ప్రతిస్పందించాక ఆమె ప్రధాన వార్తల్లోకి వచ్చారు. ఆ కేసులో శిల్పాశెట్టిని అనవసరంగా లాగుతున్నారని ఆమె టివికిచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. “నాకు రాజ్కుంద్రా ఉమ్మడి స్నేహితుల ద్వారా తెలుసు. గతంలో ఆయనని మూడునాలుగుసార్లు కలిశాను. ఆయన అరెస్టు వార్త విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ముంబయి పోలీసులు విడుదలచేసిన వాట్సాప్ చాట్ను నేను కూడా చూశాను.
ఒకవేళ ఆయన ఆ రాకెట్ను నడుపుతున్నట్లయితే చాలా బాధాకరం. జీవితంలో రాజ్కుంద్రాకు కావలసినవి అన్నీ ఉన్నాయి. ఆయన ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఆయన నేరస్థుడే అయితే ఆయనకు శిక్ష పడుతుంది” అన్నారు. శిల్పాశెట్టి తనకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆమె సినీజగత్తులో చాలా కష్టపడి పైకొచ్చారని, కానీ నేడు ఆమె ఇమేజ్కు కళంకం వాటిల్లిందని, మనం వీటన్నింటి నుంచి ఆమెను వేరుగా ఉంచాలని కూడా నికితా రావల్ అభిప్రాయపడ్డారు. నికితా రావల్ 2007 నుంచి తన సినీ కెరీర్ను ప్రారంభించారు. ఆమె ముంబయిలో పెరిగారు. మిష్టర్ హాట్ మిష్టర్ కూల్, హీరో అభిమన్యు, అమ్మాకీ బోలీ వంటి సినిమాల్లో ఆమె నటించారు.