జగిత్యాల: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జగిత్యాల పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణమూర్తి కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మరణించినట్టు అధికారులు తెలిపారు. 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సిఐ, డిఎస్పీగా విధులు నిర్వహించారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కల్గించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో దక్షిణ మూర్తి పాల్గొన్నారు. కరీంనగర్ సవారాన్ స్ట్రీట్ కు చెందిన దక్షిణ మూర్తి జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అసాంఘీక కార్యకలాపాల కట్టడిలో కఠినంగా ఉంటారని పోలీస్ శాఖలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. దక్షిణమూర్తి మృతి పట్ల పలువురు ఉన్నతాధికారులు, నాయకులు సంతాపం ప్రకటించారు.
Additional SP of Jagtial District Dies of Corona