Saturday, April 20, 2024

ఆరేళ్లు ఉంటేనే అడ్మిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కనిష్ఠ వయసును ఆరేళ్లుగా పేర్కొన్న నిబంధన అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలోనూ ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్‌లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ- స్కూల్ విద్య ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండో తరగతులు ఫౌండేషన్ స్టేజ్‌లు ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే.. చిన్నారులకు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేశారు.
దేశంలోని విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్రం నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

బట్టీ పట్టే చదువులకు స్వస్తి చెప్పి.. సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా నూతన విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక, ఉన్నత విద్య తీరు తెన్నులను పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దానిని 5+3+3+4గా మార్చింది. ఆర్ట్, సైన్స్ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును విద్యార్థులకు కట్టబెట్టేలా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.

జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ 2.0 కింద ప్లే స్కూల్స్ ఏర్పాటు చేసి, అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News