ఓటింగ్కు నై… మూజువాణికి జై
విపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో రచ్చ నడుమ వ్యవసాయ బిల్లులకు ఆమోదం
దేశవ్యాప్తంగా ఒకవైపు రైతుల నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు.. మరోవైపు పార్లమెంట్ ఎగువసభలో 14విపక్ష పార్టీలు ప్రజల పక్షాన గొంతు చించుకుని వ్యతిరేకిస్తున్నా వాటన్నింటిని అణచివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు రెండు వ్యవసాయ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకున్నది. విపక్షాలు ఓటింగ్కు పట్టుబట్టినా వినకుండా తీవ్ర ప్రతిఘటనల నడుమ మూజువాణి ఓటుతో పంతం నెగ్గించుకుంది. సాగురంగాన్ని కార్పొరేట్ల చంకలో పిల్లను చేయబోతున్నారని అన్నదాతలు, సాగు సంక్షేమాన్ని కాంక్షించే ప్రముఖులు, మేథావులు అరిచి గీ పెట్టినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. మద్దతు ధరల అంశంపై హద్దు మీరలేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటన చేసినా చట్టంలో దానిపై హామీ కనిపించక పోవడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి. కేంద్రం చర్యలను వ్యవసాయ రంగానికి డెత్ వారెంట్గా విపక్షాలు అభివర్ణించాయి. రైతులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
చిన్న సన్నకారు రైతులు తమకు పండిన కొద్ది పంటలను వ్యయ ప్రయాసలకు ఓర్చి పొరుగు రాష్ట్రాలకు తరలించగలరా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానమే దొరకలేదు. ఎగువ సభలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా మూజువాణి ఓటుతో బలవంతంగా బిల్లులను ఆమోదింపజేసుకున్నారని టిఆర్ఎస్ పక్షనేత కె.కేశవరావు ఆక్షేపించారు. అయితే వ్యవసాయ బిల్లులతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, అన్నదాతలకు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మరింత స్వేచ్ఛ లభిస్తుందని కేంద్రం ప్రకటన చేసింది. రైతుల మద్దతు ధరకు ఏ మాత్రం ఢోకా ఉండదని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మరోవైపు బిల్లు ఆమోదం సందర్భంగా రాజ్యసభలో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. మైకుల ధ్వంసం, బిల్లు ప్రతుల చించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్పై విసిరివేత లాంటి సంచలన సన్నివేశాలు జరిగాయి. ఈ రసాభాస, రచ్చ నడుమనే వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మరోవైపు పెద్దల సభలో జరిగిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పార్లమెంట్ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా విపక్షాలు దిగజార్చాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ మండిపడ్డారు.
రైతు చేతికి అధికారం
‘దేశ వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం. ఈ బిల్లులు వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు రావడంతో పాటుగా కోట్లాది రైతుల చేతికి అధికారం ఇస్తుంది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మా ప్రయత్నాలకు ఈ బిల్లులు దోహదపడతాయి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. దీంతో దిగుబడి పెరగడంతో పాటుగా మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఇకపై కూడా కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తాం, ప్రభుత్వంనుంచి పంటల సేకరణ కొనసాగుతుంది.