కాల్పుల ఘటనపై ఎంఐఎం అధిష్టానం సీరియస్
ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం శాఖ రద్దు
త్వరలో కొత్త ఎంఐఎం శాఖ ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ పేర్కొంది. పాత శాఖ స్థానంలో కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని స్పష్టీకరించింది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఇద్దరిపై కాల్పులకు తెగబడ్డ సంగతి విదితమే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీనిని సీరియస్గా పరిగణించిన మజ్లిస్ అధినాయకత్వం ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాతశాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
శుక్రవారం ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్తో స్థానికులను బెంబేలెత్తించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. ఫారూఖ్ అహ్మద్ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాడిలో మన్నన్, మోతేషాన్, జమీర్లకు గాయాలవ్వగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలిసింది. ఇప్పటికే కాల్పులకు పాల్పడిన ఫారూఖ్ అహ్మద్ను పార్టీ నుంచి తొలగించామని అసదుద్దీన్ ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి షారూఖ్ అహ్మద్ను పోలీసులు అరెస్టు చేశారు. రివాల్వర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
AIMIM Party Serious over Firing in Adilabad