ప్రాణలొదిలినా ప్రయాణీకులను కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ దీపక్ సాథే
ప్రమాదాన్ని పసిగట్టి మంటలు రాకుండా దాదాపుగా ఇంధనమంతా ఖర్చు
విమానాశ్రయం చుట్టూ 3సార్లు చక్కర్లు
జారిపోవడానికి ముందే ఇంజన్లు ఆఫ్
పైలట్ అలర్ట్ చేయడం వల్లే బతికి బయటపడ్డాం: బాధితులు
న్యూఢిల్లీ/కోజికోడ్: కేరళలోని కోజికోడ్లో రన్వేపై నుంచి జారిపడిన బోయింగ్ విమాన ప్రమాదానికి సం బంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నా యి. ఈ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఎయిర్ఇండియా పైలట్, కెప్టెన్ దీపక్ సాథే కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆయన అనుభవం వల్లే భారీ ప్రాణనష్టం తప్పిందని సమాచారం. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సాథే చాకచక్యంగా విమానం నుంచి మంటలు రాకుండా వ్యవహరించారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ల్యాండింగ్ గేర్లు పనిచేయకపోయి ఉండవచ్చునని, ఏ విమానాశ్రయంలో ల్యాండైనా ప్రమాదం తప్పదని భావించి సాథే దాని తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నించినట్లు అర్థమవతుందని పేర్కొంటున్నారు. విమానం కూలినా మంటలు చెలరేగకుండా అందులో ఇంధనాన్ని ఖర్చు చేసేందుకు విమానాశ్రయం చుట్టూ పలు మార్లు చక్కర్లు కొట్టినట్లు అర్థమవుతోందని, అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్వెబ్సైట్లో ఉంచిన మ్యాప్ ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని చెబుతున్నారు. స్వీడన్కు చెందిన ఫ్లైట్ట్రాకర్ 24అనే సంస్థ కమర్షియల్ విమానాలకు సంబంధించి ట్రాకింగ్ సమాచారాన్నంతా ఒక మ్యాప్ రూపంలో అందిస్తుంది. ఇంధనం అధిక మొత్తంలో ఖర్చు చేయడం వల్ల నిప్పు అంటుకోకుండా కాపాడిందని ఎన్హెచ్ఏఐ ఆర్థిక సలహాదారు నీలేశ్ సాథె తన ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు.
అందుకే విరిగిపోయిన విమానంలోంచి కనీసం పొగ, దుమ్ము రాలేదు. జారిపోవడానికి ముందే ఆయన విమానం ఇంజిన్లను ఆఫ్ చేశారు. ఆయన పొట్ట ముందుకు వంగింది. విమానం కుడిరెక్క విరిగిపోయింది. పైలట్ ప్రాణాలొదిలి 180 మంది ప్రయాణికులను రక్షించారు అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘వారం రోజుల ముందే ఆయన నాకు ఫోన్ చేశారు. ఎప్పటిలాగే సరదాగా మాట్లాడారు. వందేభారత్ మిషన్ గురించి అడగ్గా అరబ్ దేశాల నుంచి దేశపౌరులను తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఆ దేశాలు ప్రజలను రానివ్వడం లేదు కదా మీరు ఖాళీ విమానాలు తీసుకెళ్తున్నారా అని ప్రశ్నించ గా.. లేదు, ఆ దేశాలకు అవసరమైన పండ్లు, కూరగాయలు, ఔషధాలు తీసుకెళ్తాం. విమానాలెప్పుడూ ఖాళీగా వెళ్లవు’ అని చెప్పినట్లు నీలేష్ వివరించారు.
పైలట్ అలర్ట్ చేయడం వల్లే బతికి బయటపడ్డాం : బాధితులు
పైలట్ ధైర్యంగా వ్యవహరించి అలర్ట్ చేయడం వల్లే తాము బతికి బయటపడ్డామని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం మంటలు లేవడం, స్థానికులు వచ్చి తమను సురక్షితంగా బయటకు తీసుకువెళ్లిన సంఘటనల్ని బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సురక్షితంగా ల్యాండ్ చేయడానికి పైలట్ రెండుసార్లు ప్రయత్నించారని, భారీ వర్షం వల్ల పరిస్థితి తన కంట్రోల్లో లేకపోవడంతో పైలట్ తమను హెచ్చరించారని వి.ఇబ్రహీం అనే ప్రయాణికుడు తెలిపారు. ఆ తర్వాత లోయలోకి జారిపడ్డ విమానం రెండు ముక్కలైంది. ఇబ్రహీం స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విమానానికి కెప్టెన్గా వ్యవహరించిన పైలట్ దీపక్ వసంత్సాథే(59)ను ప్రయాణికులు గుర్తు చేసుకుంటున్నారు. సాథే కూడా ఈ ప్రమాదంలో మరణించారు. విమానాల్ని నడపడంలో సాథేకు 22 ఏళ్ల అనుభవమున్నది. గాయపడ్డ 123మంది కోజికోడ్లోని మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరికి వెన్నెముక దెబ్బతిన్నది. మన దేశంలో ఇంతటి దారుణ విమాన ప్రమాదం పదేళ్లలో ఇది రెండోది. 2010లో మంగళూరు లో జరిగిన ప్రమాదంలో 158మంది మృతి చెందారు. అది కూడా దుబా య్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానమే కావడం గమనార్హం.
Air India Pilot Deepak Sathe died