మన తెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్కు ఇంకా మూడు రోజుల సమయముంది. అప్పుడే మార్కెట్లో బిజి3 (హెచ్టి) పత్తి విత్తనాల దందా మొదలైంది. అనుమతి లేని అక్రమ బిజి3 విత్తనాల సరఫరా గుట్టుగా సాగుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖకు లేఖ ద్వారా స్పష్టం చేసింది. ప్రమాదకరమైన హెచ్టి పత్తి విత్తనాలు రైతులు సాగు చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. సరఫరాపై తగు జాగ్రత్తలు తీసుకుని నిరోధించాలని కోరింది. అనుమతి లేని పత్తి విత్తనాల సాగుకు సంబంధించి ఇంటిలెజిన్స్ బ్యూరో రెండు నివేదికలను ఇటీవల సమర్పించినట్లు కేంద్రం తెలిపింది. రైతులను ఆర్గనైజ్ చేసి మరీ ఈ విత్తనాలను అంటగడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు వివరించింది. మరోవైపు నకిలీలు, అనుమతి లేని విత్తనాలపై సిఎం కె.చంద్రశేఖర్రావు కూడా సీరియస్గా ఉన్నారు. దీంతో జిల్లాల వారీగా టాస్క్ఫోర్స్తో పాటు పర్యవేక్షణ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
ఎక్కువగా ఆదిలాబాద్, మేడ్చల్, జోగులాంబ గద్వాల్, నాగర్కర్నూల్, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో బిజి3 దందా జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లుగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు తీసుకుంటోంది. 2017లో 368 విత్తన శాంపిళ్లను విశ్లేషించగా అందులో 81 పాజిటివ్గా తేలాయి. అలాగే 2018లో 694 విత్తన శాంపిళ్లను పరీక్షించగా 119 పాజిటివ్గా గుర్తించారు. ఇక 2019లో 17 విత్తన శాంపిళ్లు మాత్రమే సేకరించి విశ్లేషించారు. ఇందులో 8 పాజిటివ్గా నిర్ధారించారు. ఇక గతేడాది నకిలీ, అనుమతి లేని విత్తనాలపై 56 మంది అరెస్ట్ చేశారు. నలుగురిపై 6ఎ కేసులు నమోదు చేశారు. ఐపిసి 420 కింద 65 మందిపై కేసు నమోదైంది. 10 మంది లైసెన్స్లు సస్పెండ్ చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా ఏకంగా 3840 క్వింటాళ్ల విత్తనాలను సీజ్ చేయగా వీటి విలువ రూ.9.87 కోట్లుగా ఉంది. రూ.16 కోట్ల విలువ చేసే విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
అవగాహన కార్యక్రమాలేవి ?
అనుమతి లేని పత్తి విత్తనాల సరఫరాపై అధికారులు కొన్నిచోట్ల చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాగే ఈ విష బిజి-3 విత్తనాల సాగు మంచిది కాదని, కనీస మాత్రంగా ప్రచారం చేయడం లేదని, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిసింది. కలుపు రాదని, కూలీల అవసరం ఉండదని విక్రయదారులు చెబుతుండటంతో విష విత్తనాల మాటున దాగిన నష్టం ఎరుగక, రైతులు ఆశ కొద్ది ఈ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. అలాగే బిజి3 విత్తనాలు సాగు చేస్తే ఖచ్చితంగా గ్లైఫోసేట్ అనే రసాయనం వాడాల్సి ఉంటుంది. దీనిపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతోంది. షాప్ల్లో కాకుండా వేరే ప్రదేశాల్లో ఉంచి, రైతులకు ఈ గడ్డి మందును రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.