మాస్కో: విషప్రయోగం జరిగి తాను బెర్లిన్లోని ఆసుపత్రిలో చికిత్స పొందినపుడు జర్మన్ చాన్సలర్ ఆంజెలా మార్కెల్ తనను ఆసుపత్రిలో పరామర్శించారని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ సోమవారం ధ్రువీకరించారు. తమ మధ్య సమావేశం జరిగిందని, అయితే దాన్ని రహస్య సమావేశం అనకూడదని ఆయన చెప్పారు. 32 రోజులుగా బెర్లిన్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవాల్నీని జర్మన్ చాన్సలర్ రహస్యంగా వచ్చి పరామర్శించినట్లు ఆదివారం జర్మనీ పత్రిక డెర్ స్పైజల్ ఒక వార్తను ప్రచురించింది. దీనిపై నవాల్నీ స్పందిస్తూ జర్మన్ చాన్సలర్ వ్యక్తిగత సందర్శనగా పరిగణించాలని, తన కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడారని ఆయన తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించే నవాల్నీ ఆగస్టు 20న రష్యాలో అస్వస్థతకు గురైన రెండు రోజుల తర్వాత ఒక జర్మనీకి విమానంలో వెళ్లారు. ఆ రెండు రోజులు ఆయన సైబీరియా నగరం ఓమ్స్లోని ఒక ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు. ఆయన శరీరంలో విష పదార్థాలు ఏవీ లేవని రష్యన్ డాక్టర్లు పేర్కొన్నప్పటకీ జర్మనీ రసాయిక ఆయుధాలు నిపుణులు మాత్రం సోవియా కాలం నాటి నోవిచోక్ అనే నరాలపై ప్రభావం చూపించే విషప్రయోగం ఆయనపై జరిగినట్లు నిర్ధారించారు. ఫ్రాన్స్, స్వీడన్లో జరిపిన లాబొరేటరీ పరీక్షలు ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి.