Friday, April 19, 2024

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

‘కపాలాలపై కరెన్సీ పేర్చుకునే క్షుద్ర సాహిత్యమో, వెలుతురు కిరణం సోకని శృంగార నవలల చీకటి గుహో కాదిది. అక్షరాలగొయ్యి తవ్వుకోవడం. అరచేతిలో అశోక వనాలు సృష్టించే మాయాజాలం అంతకన్నా కాదు. అక్షరమక్షరం అనలమై మండుతున్నప్పుడు సమీకరించి సైన్యంలా రూ పొందించిన కృషి ఫలితమే ఈ కవిత్వం రక్తరేఖలతో నిర్మించిన దృశ్యాలే” ఈ కవితా చిత్రాలు” అలిశెట్టి ప్రభాకర్ తెలుగు కవిత్వంలో పరిచయం అక్కరలేని కవి. తెలుగు సాహితీలోకం మర్చిపోలేని కవి. ‘రాసిలో కన్నావాసి’ గొప్పదన్నట్లుగా ఎంత కాలం బతికామో అన్నది ముఖ్యం కాదు ఎలా బతికాము, ఎందరి జ్ఞాపకాల్లో నిలిచిపోయామో ముఖ్యమన్నట్లుగా తన జీవితాన్ని ఉదాహరణ చేసి చూపించిన కవి.

1956 జనవరి 12న జగిత్యాలలో చినరాజం లక్ష్మీ దంపతులకు జన్మించిన అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి ఒకే రోజు వచ్చే కొద్ది మందిలో ఒకరుగా మిగిలిపోయారు. పదవ తరగతి కరీంనగర్‌లో చదివి ఇంటర్ మీడియట్ సిద్దిపేటలో తన అక్క బావల వద్ద ఉండి చదువుకొన్నారు. 18 ఏండ్ల ప్రాయంలోనే తన కవిత్వాన్ని చిన్న పదాలతో గొప్ప అర్థాన్నిచ్చే అలతి పదాలతో అనంత అర్థాలు చెప్పి అనల్పమైన వాక్యాలతో శబ్ద శక్తిని, తన చిత్రాలతో మహా ఇతివృత్త శక్తిని అందించాడు. జగిత్యాల రైతాంగ జైత్రయాత్ర సమయంలో దోపిడీ చిహ్నాలపై మంటల జెండాలునాటి, అక్షరాల్ని ఎర్ర పావురాలుగా ఎగుర వేసి దశదిశ నిర్దేశిస్తూ తనదైన “పరిష్కారం” చూపారు.

పెత్తందారుల, దోపిడీదారుల పద ఘటన లో నలిగిపోతున్న మోదుగు పూల వనంలో పద క్షిపణులు పూయించి యోధులకు అందించాడు. తన చిత్ర కవితలతో సంచలనాలు సృష్టించి సమాజాన్ని పట్టి ఇచ్చి ఈ శిథిల ప్రపంచాన్ని పునః నిర్మించే ప్రతి విద్యార్థికి అంకితం ఇచ్చాడు. అక్షరాన్ని ఆయుధం చేసి తన కవిత్వాన్ని ప్రాణ వాయువుగా మార్చి నింపాలనే తపించాడు. ‘వేద్యభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలక మీద దిద్దుకున్నప్పుడూ అక్షర నేత్రం తెరిచి ఆనాటి ‘దొర’ తనాన్ని ఆగ్రహించినప్పుడూ ప్రభాకర్‌కు పద్దెనిమిదేళ్ళు. సిద్ధాంత గ్రంథాల సారమేది వడబొయ్యకున్నా సిద్ధార్థ్దుడు వదిలి వెళ్ళిన ఈ రాజ్యమ్మీది, నెత్తుటి ధారల్ని కడిగేందుకు కవిత్వం ప్రభాకర్‌కు అవసరమై అప్పటికి పద్నాలు గేళ్ళు. “సిటీ లైఫ్‌లో” నరకప్రాయమైన నగర నాగరికతను జీవితాన్ని, నాణేనికి రెండో వైపులా అందించి దినపత్రికల శైలినే మార్చి వేశారు. పత్రికా ఎజెండాలు ఏమైనా తన అభ్యుదయ భావాలను ముక్కుసూటిగా తన కవితల్లో వెల్లడించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు అలిశెట్టి.

ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలు రాత్రి ఆజ్ బెస్ట్ ఆజ్ రేకుల కింద పడి ఎంత వేడెక్కిన మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుడు ప్రభాకర్. అనారోగ్యం బాధిస్తున్నా అక్షరాల్ని అమ్ముకోలేదు. అక్షరాల్నే నమ్ముకున్న ప్రభాకర్ తను రాసిన ప్రతీది ఆణిముత్యం కాదని ప్రకటించారు. కాన్సర్‌తో పోరాడాడు తప్ప కాసులకు వెతుక్కోలేదు.తాను వాసిన కొన్ని కవితలు సినిమాల్లో వాడుకోవడానికి గాని, సినిమాల కోసం వాయడం గాని ప్రభాకర్‌కు ఇష్టముండేది కాదు. సినిమా కవిగా మారి ఉంటే ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చని తెలిసినా సమాజం కోసం వాస్తావని ప్రకటించారు. తొంభై తొమ్మిది మంది చర్మాన్ని వొలిచి నూరో వాడొక్కడే పరుచుకునే తివాసీ ఈ దేశంలో ‘కళాపోషణ’ అని భావించి అటువంటి కళలకు దూరంగా ప్రజా సాహిత్యానికి దగ్గరగా నిలిచాడు.

ఎర్రెర్రని/ గాయాన్ని/ గాయంగా మాత్రమే/ అదొక/ ప్రమాద సూచిక/ ప్రారంభ సంచిక/ విప్లవోద్యమాల సమయంలో జగిత్యాల గడ్డ మీద పుట్టిన ప్రభాకర్ కవితాకాశంలో ‘ఎర్ర పావురాలు’ మంటల జెండా’ ఎగరేశారు. రక్తరేఖలుగా మళ్ళీ మళ్ళీ ప్రసరించారు. తన కవితా చిత్ర ప్రదర్శనలతో ఈ సమాజాన్ని అంగుళం మేరకి కదిలించగలననే ఆశతో చివరి శ్వాస వరకు బతికారు అలిశెట్టి ప్రభాకర్ ఇప్పటి వరకు బతికుంటే బాగుండేది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మనకు ఇచ్చి వెళ్ళిన పద చిత్రాలు మనందరి మదిలో పదిలంగానే ఉన్నాయి. ఆయన చెప్పినట్లు మరణం ఆయన చివరి చరణం కాదు.

సురేష్ కాలేరు
9866174474

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News