ఢిల్లీ: 21 రోజుల పాటు ఆల్ ఇండియా లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భారత్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడడంతో ఈ వైరస్ ను నిర్మూలించేందుకు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశమంతా లాక్ డౌన్ ప్రారంభమవుతుందని, ఎప్రిల్ 14 వరకు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దన్నారు. ఒక్కరు కూడా బయట కనిపించొద్దని ఆదేశాలు జారీ చేశారు. మూడు వారాల పాటు 130 కోట్ల మంది ఇంట్లోనే ఉండాలన్నారు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలంటే లాక్డౌన్ తప్పదని తెలిపారు. జనతా కర్ఫూ నుంచి లాక్డౌన్ అమలు చేస్తామని, ఇది ఒక రంగా కర్ఫ్యూ లాంటిదేనని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు బయటపడేందుకు చాలా రోజులు పడుతుందని, తెలియకుండానే ఇతరుల నుంచి కరోనా సంక్రమిస్తోందని, కరోనా వైరస్ మొదటి లక్ష మందికి సోకడానికి 67 రోజులు పట్టిందని, మిగితా మూడు లక్షల మందికి వారం రోజుల్లోనే వ్యాప్తి చెందిందని తెలియజేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగైన వైద్య సేవలు ఉన్నా కరోనా కంట్రోల్ కాలేదని, కొద్ది రోజుల పాటు బయటకు వెళ్లాలనే ఆలోచన ప్రజలు మానుకోవాలని సూచించారు. కరోనా వైరస్ దావానంలా వ్యాపిస్తోందని డబ్ల్యుహెచ్ఒ హెచ్చరించింది. వైద్య సదుపాయాల మెరుగు కోసం రూ.15 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మొద్దని, నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని చెప్పారు. కరోనా ఎవరినీ వదిలిపెట్టదని, ఎవరి ఇల్లే వారికి లక్ష్మణరేఖ అని ప్రధాని తెలిపారు.